Posts

Current Affairs

వచ్చే రెండేళ్లూ భారత వృద్ధి 6.7%

వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు (2025-26, 2026-27) భారత వృద్ధి రేటు 6.7 శాతంగా కొనసాగొచ్చని ప్రపంచ బ్యాంకు తన తాజా అంచనాల్లో ప్రకటించింది. 2025-26లో దక్షిణాసియా వృద్ధి 6.2 శాతంగా ఉండొచ్చనీ పేర్కొంది.  ప్రపంచబ్యాంకు విడుదల చేసిన అంచనాల ప్రకారం.. భారత్‌లో సేవల రంగం స్థిరంగా వృద్ధి చెందొచ్చు. తయారీ కార్యకలాపాలు మరింత బలోపేతం కావొచ్చు. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదం చేయొచ్చు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితం కావొచ్చు. పెట్టుబడుల్లో మందగమనం, బలహీన తయారీ ఇందుకు కారణమని పేర్కొంది. భారత్‌ను మినహాయిస్తే దక్షిణాసియా ప్రాంత వృద్ధి 2024లో 3.9 శాతంగా ఉండొచ్చు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం వల్ల పెట్టుబడిదార్ల విశ్వాసం దెబ్బతింది. పాకిస్థాన్, శ్రీలంక పుంజుకోవడం సానుకూలాంశం. 

Current Affairs

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025

దేశంలోనే అతిపెద్ద వాహన ప్రదర్శన అయిన ‘భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025, జనవరి 17న దిల్లీలో ప్రారంభించారు. 2024లో దేశంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2.5 కోట్ల మేర విక్రయమయ్యాయని.. నాలుగేళ్లలోనే 36 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.10 లక్షల కోట్ల) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించిందని మోదీ తెలిపారు. భారత్‌లో తయారీ, పీఎల్‌ఐ పథకాలతో రూ.2.25 లక్షల కోట్లకు పైగా విలువైన అమ్మకాలు జరిగాయని, 1.5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయని ప్రధాని వెల్లడించారు.

Current Affairs

రాజధాని పనుల్లో పురోగతి ధ్రువీకరణ సంస్థగా ఆస్కీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సాయంతో చేపట్టే వివిధ పనుల పురోగతిని ధ్రువీకరించేందుకు స్వతంత్ర పరిశీలన సంస్థగా అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) వ్యవహరించనుంది. ఈ మేరకు ఆస్కీ ఎంపికకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్‌ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి కన్నబాబు జనవరి 17న ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనులకు ఆర్థిక సాయమందించే రెండు బ్యాంకులూ నిర్దేశించిన డీఎల్‌ఐఎస్‌ మేరకు పనుల్లో పురోగతిని హైదరాబాద్‌కు చెందిన ఆస్కీ ధ్రువీకరించనుంది. 

Current Affairs

విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,500 కోట్లు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి 2025 జనవరి 17న దిల్లీలో వెల్లడించారు. విశాఖ ఉక్కు అనేది  100% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 73 లక్షల టన్నుల ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యంతో ఉన్న ఈ సంస్థకు రూ.7,686.24 కోట్ల ఆస్తులు, రూ.26,114.92 కోట్ల అప్పులున్నాయి. 2023-24లో రూ.4,848.86 కోట్లు, 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొంది. వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. 

Current Affairs

క్రీడా పురస్కారాలు

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, జనవరి 17న దిల్లీలో క్రీడా పురస్కారాలు అందజేశారు. 2024లో ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ 400 మీటర్ల టీ20 విభాగంలో ఛాంపియన్‌గా నిలవడంతో పాటు పారిస్‌ పారాలింపిక్స్‌లో ఇదే విభాగంలో కాంస్యం సాధించిన తెలంగాణకు చెందిన జీవాంజి దీప్తి రాష్ట్రపతి నుంచి అర్జున పురస్కారం అందుకుంది. 2023 ఆసియా అథ్లెటిక్స్‌ 100 మీటర్ల ఛాంపియన్‌గా నిలవడమే కాక అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించిన, నిరుడు ఒలింపిక్స్‌లోనూ పోటీ పడ్డ ఆంధ్ర అమ్మాయి జ్యోతి యర్రాజి శిక్షణ కోసం దక్షిణాఫ్రికాలో ఉండడంతో అర్జున అవార్డు స్వీకరించలేకపోయింది. మొత్తం 32 మందిని అర్జున వరించింది. అత్యున్నత పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నకు ఈసారి నలుగురు ఎంపికయ్యారు. ఇటీవలే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించిన దొమ్మరాజు గుకేశ్‌తో పాటు పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్‌ మను బాకర్, వరుసగా రెండు ఒలింపిక్స్‌లో కాంస్యాలు సాధించిన హాకీ జట్టులో భాగమైన హర్మన్‌ప్రీత్‌ సింగ్, పారిస్‌ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన హై జంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాష్ట్రపతి నుంచి ఖేల్‌రత్న పురస్కారాలు అందుకున్నారు. 

Current Affairs

పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంకులకు కొత్త ఎండీలు

ప్రభుత్వరంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), ఇండియన్‌ బ్యాంకులకు కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారు (సీఈఓ)లను కేంద్ర ప్రభుత్వం 2025, జనవరి 16న నియమించింది.  పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా అశోక్‌ చంద్ర నియమితులయ్యారు. ఆయన కార్పొరేషన్‌ బ్యాంకుతో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇటీవల వరకు కెనరా బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా పదోన్నతిపై పీఎన్‌బీ ఎండీ, సీఈఓ అయ్యారు. ఇండియన్‌ బ్యాంకు ఎండీ, సీఈఓగా బినోద్‌ కుమార్‌ను ఎంపిక చేశారు. పీఎన్‌బీలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ఆయన 1994లో నియమితులయ్యారు. అక్కడి నుంచి పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. 

Current Affairs

గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు

మన దేశ 76వ గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియంతో ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అధ్యక్షుడి హోదాలో సుబియంతో భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల పర్యటనలో భాగంగా జనవరి 25న ఆయన దిల్లీకి చేరుకుంటారని, 26న గణతంత్ర ఉత్సవాలకు హాజరవుతారని విదేశీ వ్యవహారాల శాఖ జనవరి 16న వెల్లడించింది.

Current Affairs

నైపుణ్యాల సన్నద్ధతలో భారత్‌కు రెండో ర్యాంకు

కృత్రిమమేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్‌లో అత్యధిక డిమాండ్‌ కలిగిన ఉద్యోగ మార్కెట్‌కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతల్లో భారత్‌ రెండో ర్యాంకు సాధించింది. తొలి స్థానంలో అమెరికా నిలిచింది.  ఈ మేరకు క్యూఎస్‌ వరల్డ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఇండెక్స్‌ 2025 వెల్లడించింది. లండన్‌ కేంద్రంగా పనిచేసే క్వాక్వరెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) సంస్థ 2025, జనవరి 16న ఈ ఏడాది తన తొలి ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఇండెక్స్‌ను విడుదల చేసింది.

Current Affairs

బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కోటక్‌ను బీసీసీఐ 2025, జనవరి 16న నియమించింది. ఈయన సుదీర్ఘ కాలంగా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లలో భారత సీనియర్, ‘ఎ’ జట్ల పర్యటనల్లో కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 2024 ఐర్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గానూ వ్యవహరించాడు.

Current Affairs

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ 2025, జనవరి 16న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో మూడో లాంచ్‌ప్యాడ్‌ (నూతన రాకెట్‌ ప్రయోగ వేదిక) ఏర్పాటు లాంటి నిర్ణయాలు తీసుకుంది.  కోటీ పదిహేను లక్షల మంది ఉద్యోగుల, పింఛనుదారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం(పే కమిషన్‌) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది. ఏపీలోని శ్రీహరికోట ఇస్రో సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో రూ.3,984.86 కోట్ల అంచనా వ్యయంతో మూడో లాంచ్‌ప్యాడ్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని ఏర్పాటు 48 నెలల్లో పూర్తికానుంది. మూన్‌మిషన్, అంతరిక్షంలో భారత్‌ స్టేషన్‌ ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా దీని ఏర్పాటు జరుగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.