Posts

Current Affairs

ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువ

ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, వీటిలో 33.76 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ తరహా స్కూళ్లు అత్యధికంగా ఏపీలో 12,912 ఉండగా, తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (9,508), ఝార్ఖండ్‌ (9,172), మహారాష్ట్ర (8,152) కర్ణాటక (7,349), లక్షద్వీప్‌ (7,217), మధ్యప్రదేశ్‌ (7,217), పశ్చిమ్‌ బెంగాల్‌ (6,482), రాజస్థాన్‌ (6,117), ఛత్తీస్‌గఢ్‌ (5,973), తెలంగాణ (5,001) ఉన్నాయి.

Current Affairs

16వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం పదవీకాలాన్ని నెలరోజులపాటు పొడిగించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 11న ఆమోదం తెలిపారు. 2023 డిసెంబరు 31న ఏర్పాటైన ఈ సంఘం 2026 ఏప్రిల్‌ 1 నుంచి వచ్చే ఐదేళ్ల కాలానికి పంపిణీ చేయాల్సిన ఆర్థిక వనరులపై సెప్టెంబరు 31వ తేదీలోపు రాష్ట్రపతికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అది కాస్త జాప్యం కానున్న నేపథ్యంలో కమిషన్‌ గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

Current Affairs

ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సోనాలీ సేన్‌ గుప్తా

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా సోనాలీ సేన్‌ గుప్తా  నియమితులయ్యారు. ఇంతవరకు ఆర్‌బీఐ బెంగళూరు కార్యాలయంలో, కర్ణాటక రీజనల్‌ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరించారు. ఆర్‌బీఐలోనే ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్, మానవ వనరుల నిర్వహణ, బ్యాంకింగ్‌ నియంత్రణ-పర్యవేక్షణ విభాగాల్లోనూ ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Current Affairs

పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలు

దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 11న పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలను ప్రారంభించి ప్రసంగించారు. రూ.24 వేల కోట్లతో చేపట్టే ధనధాన్య యోజన కింద 36 పథకాలను సమ్మిళితం చేసి అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో పంటల ఉత్పాదకత పెంపుతోపాటు పశుసంవర్ధకంపైనా ఇందులో దృష్టిసారిస్తామని చెప్పారు. 

Current Affairs

సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌కు భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు వరుసగా మూడోసారి ఎన్నికైంది. నవంబరు 2022- నవంబరు 2029 కాలానికి గాను కొత్త సభ్యుల వివరాలను 2025, అక్టోబరు 10న బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. సింధు, ఆన్‌ సి యంగ్‌ (కొరియా), దోహా హనీ (ఈజిప్ట్‌), జియా యి ఫాన్‌ (చైనా), డెబోరా జిలీ (నెదర్లాండ్స్‌) కమిషన్‌లో చోటు సంపాదించారు. అయిదు స్థానాలకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే రావడంతో వీరంతా ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. 

Current Affairs

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా శశిధర్‌

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా సి.శశిధర్‌ 2025, అక్టోబరు 10న అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్‌పర్సన్‌ అనురాధ పదవీకాలం పూర్తి కావడంతో సభ్యుడిగా ఉన్న శశిధర్‌కు ప్రభుత్వం ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కమిషన్‌ సభ్యురాలు బీఎస్‌ సెలీనా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శశిధర్‌ బాధ్యతలు చేపట్టారు. 

Current Affairs

భారత సైన్యానికి ‘విద్యుత్‌ రక్షక్‌’పై పేటెంట్‌

భారత సైన్యానికి చెందిన సమీకృత జనరేటింగ్‌ మానిటరింగ్, ప్రొటెక్షన్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ‘విద్యుత్‌ రక్షక్‌’కు పేటెంట్‌ హక్కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దీన్ని మేజర్‌ రాజ్‌ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ అభివృద్ధి చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్తు వ్యవస్థలను కాపాడటంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. బహుళ జనరేటర్లు, పవర్‌ సిస్టమ్‌ల సమగ్ర పర్యవేక్షణ, రక్షణ, నియంత్రణలకు ఇది ఉపయోగపడుతుంది. భారత సైన్యానికి ‘విద్యుత్‌ రక్షక్‌’పై 2023 నుంచి 20 ఏళ్లపాటు ఈ పేటెంట్‌ హక్కును కల్పించారు. 

Current Affairs

భారత అమ్ములపొదిలోకి ‘మార్ట్‌లెట్‌’

రక్షణరంగంలో విస్తృత సహకారం కోసం భారత్‌-బ్రిటన్‌ మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్‌లెట్‌’లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ మార్ట్‌లెట్‌ క్షిపణులను ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌కు చెందిన ‘థేల్స్‌ ఎయిర్‌ డిఫెన్స్‌’ అనే సంస్థ అభివృద్ధి చేస్తోంది.  జానపద కథల్లోని ‘మార్ట్‌లెట్‌’ అనే పక్షి పేరును దీనికి పెట్టారు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకోని, అలుపెరగని పక్షి అని దీని అర్థం. 

Current Affairs

నోబెల్‌ శాంతి పురస్కారం

వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోను (58) 2025 ఏడాదికి ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా కమిటీ ప్రశంసించింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికోలస్‌ మాడ్యురో నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ కొనియాడింది.  నోబెల్‌ శాంతి బహుమతిని గెల్చుకున్న 20వ మహిళ మచాదో. ఆమె 1967 అక్టోబరు 7న జన్మించారు.

Current Affairs

భారత్‌లో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. హిమాలయ రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా వరుసగా ఏడాదికి సగటున 9.5 గంటలు, 8.5 గంటల ఎండ పడే సమయం తగ్గిపోయిందని పేర్కొంది. 1988-2018 మధ్య 20 వాతావరణ కేంద్రాల్లో ఉన్న డేటాను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటరాలజీ, భారత వాతావరణ విభాగం ఇందులో పాలుపంచుకున్నాయి.  ఆ వివరాల ప్రకారం.. దక్కన్‌ ప్రాంతంలో సూర్యరశ్మి సమయం ఏడాదికి 3 గంటలు తగ్గిపోగా.. ఉత్తరభారతంలో ఇది 1.5 గంటలుగా ఉంది.