Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

జాతీయ సైన్స్‌ దినోత్సవం

శాస్త్రీయ విజ్ఞానం మానవుడి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. రాతి పనిముట్ల నుంచి కృత్రిమ మేధ వినియోగం వరకు సైన్స్‌ అనేక అద్భుతాలకు కారణమైంది. ప్రాచీన కాలం నుంచే మనదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగింది. ఎందరో శాస్త్రవేత్తలు తమ మార్గదర్శకత్వంతో భారత్‌లో శాస్త్రీయ పురోగతికి కృషి చేశారు. వారిలో సి.వి.రామన్‌ ఒకరు. ఆయన ఆవిష్కరించిన రామన్‌ ఎఫెక్ట్‌ భౌతికశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టినందుకు గుర్తుగా ఏటా మన దేశంలో ఫిబ్రవరి 28న ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’గా (National Science Day) ద్చ్వ్శీ నిర్వహిస్తారు. సైన్స్‌ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సమాజ శ్రేయస్సులో దీని పాత్ర, విజయాలను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం సి.వి.రామన్‌ 1928, ఫిబ్రవరి 28న ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుక్కున్నారు. ఈ పరిశోధన భౌతికశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారతదేశ ఖ్యాతి కూడా విశ్వవ్యాప్తమైంది. శాస్త్రీయ రంగంలో సి.వి.రామన్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను గుర్తించే లక్ష్యంతో ఫిబ్రవరి 28న ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’గా ప్రకటించాలని 1986లో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్‌సీఎస్‌టీసీ) ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. 1987 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.  

Current Affairs

జీరో డిస్‌క్రిమినేషన్‌ డే

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలా కాకుండా పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు, ఆరోగ్యం లాంటి కారణాలతో సమాజంలో ప్రజలు, వర్గాల మధ్య భేదభావాన్ని చూపడాన్ని వివక్ష అంటారు. దీని వల్ల ఎందరో వ్యక్తులు తమ హక్కులను కోల్పోతున్నారు. దీన్ని అధిగమించి సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవం, సమన్యాయం దక్కాలనే లక్ష్యంతో ఏటా మార్చి 1న ‘జీరో డిస్‌క్రిమినేషన్‌ డే’గా నిర్వహిస్తారు. వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు పోరాడాల్సిన ఆవశ్యతను తెలియజేయడంతోపాటు సమసమాజ ఏర్పాటును ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై ఐక్యరాజ్యసమితి ఉమ్మడి కార్యక్రమం ‘యూఎన్‌ఎయిడ్స్‌’ చొరవ ఫలితంగా ‘జీరో డిస్‌క్రిమినేషన్‌ డే’ ఉనికిలోకి వచ్చింది. 2013, డిసెంబరు 1న ‘వరల్డ్‌ ఎయిడ్స్‌ డే’ నాడు ప్రారంభించిన జీరో డిస్‌క్రిమినేషన్‌ ప్రచారం నుంచి ఈ రోజు ఆవిర్భవించింది.  

Current Affairs

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణం

    అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మృతిని 2026,  మార్చి 1న ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. ఖమేనీ.. ఇరాన్‌ సుప్రీం నేతగా 1989లో పగ్గాలు చేపట్టి పశ్చిమాసియాలో ఇరాన్‌ను ఓ ప్రాంతీయ శక్తిగా నిలిపారు. ఖమేనీ 1939లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. చిన్న వయసులోనే షియా మత బోధకుడిగా మారారు. ఇరాన్‌ రాజు మహమ్మద్‌ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా జరిగిన 1979 ఇస్లామిక్‌ విప్లవంలో పాల్గొన్నారు. 1981లో అప్పటి అధ్యక్షుడు మహమ్మద్‌ అలీ రెజాయ్‌ బ్రీఫ్‌కేస్‌ బాంబు దాడిలో చనిపోయారు. దీంతో ఖమేనీ అధ్యక్ష బరిలోకి దిగారు. సుప్రీం నేత రూహుల్లా ఖొమైనీ అండ కూడా ఉండటంతో ఆయన విజయం సాధించారు. 

Current Affairs

భారత్‌లో చమురు నిల్వలు

    పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉందనే విశ్లేషనలు వినిపిస్తున్నాయి. కెప్లర్‌ గణాంకాల ప్రకారం.. మన దేశం దగ్గర వాణిజ్య ముడిచమురు నిల్వలు దాదాపు 100 మిలియన్‌ బ్యారెళ్లు ఉన్నాయి. ఇందుకు అదనంగా మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో దాదాపు 39 మి.బ్యారెళ్లు ఉంది. భౌగోళిక - రాజకీయ ఒడుదొడుకులు ఎదురైనప్పుడు ఇంధన అవసరాలను తీర్చడానికి దేశంలోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 74 రోజుల పాటు సరిపోతాయని గతంలో కేంద్ర చమురు మంత్రి హర్దిప్‌ సింగ్‌ పురి ప్రకటించారు. 

Current Affairs

ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం

    సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్‌ ప్రొటెక్షన్‌ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగించనుంది. గూగుల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వచ్చే వెబ్‌ లింక్‌లను కూడా పరిశీలించేందుకు ఇది ఉపయోగ పడనుంది. వినియోగదారులు డిజిటల్‌ మోసాల బారిన పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరు సంస్థలూ ప్రకటించాయి. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఇంటెలిజెన్స్‌కు గూగుల్‌కు చెందిన రిచ్‌ కమ్యూనికేషన్స్‌ సర్వీసెస్‌ (ఆర్‌సీఎస్‌) జత కలవడం వల్ల మోసపూరిత సందేశాలను అడ్డుకోవడమే కాక, అధిక నాణ్యత గల ఫోటోలు/వీడియోలు, ఇంటరాక్టివ్‌ మెసేజ్‌లను వినియోగదారులు అందుకోగలరని తెలిపాయి. 

Current Affairs

గెయిల్‌ ఛైర్మన్‌గా దీపక్‌ గుప్తా

    దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియా, ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టరుగా దీపక్‌ గుప్తా 2026, మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి 28 వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు. సందీప్‌ కుమార్‌ గుప్తా పదవీ విరమణతో, దీపక్‌ బాధ్యతలు చేపట్టారు.

Current Affairs

సీఎస్‌గా సాయిప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ 2026, ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా సేవలందించిన విజయానంద్‌ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో సాయిప్రసాద్‌ నియమితులయ్యారు.  సాయిప్రసాద్‌ను జలవనరులు, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పోస్టుల్లోను (పూర్తి అదనపు బాధ్యత) కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Current Affairs

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని 2026, ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా హ్యూమన్‌ ప్యాపిలోమావైరస్‌(హెచ్‌పీవీ)ని ఇది అరికడుతుంది. ఇందులోభాగంగా 14 సంవత్సరాల బాలికలకు సింగిల్‌ డోస్‌ ‘గార్డాసిల్‌-4’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది.   

Current Affairs

93వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆరవ్‌

ముంబయికి చెందిన ఆరవ్‌ (17 ఏళ్లు) గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు. మన దేశం నుంచి జీఎం అయిన 93వ ఆటగాడిగా అతడు సాధించాడు. బోస్నియాలో జరిగిన జీఎం మిక్స్‌ బిజెల్‌జినా టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా.. గ్రాండ్‌మాస్టర్‌ హోదాకు అవసరమైన చివరి నార్మ్‌ను ఆరవ్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 2506 ఎలో పాయింట్లు ఉన్నయి. ఆరవ్‌ 2022లో ఫిడే మాస్టర్, 2024లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాలు దక్కించున్నాడు. 

Current Affairs

రంజీ ట్రోఫీ

    భారత దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూకశ్మీర్‌ నిలిచింది. 67 ఏళ్ల తన రంజీ చరిత్రలో తొలిసారిగా ఈ జట్టు విజేతగా నిలిచింది. 2026, ఫిబ్రవరి 28న హుబ్బళి వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటకపై జమ్మూకశ్మీర్‌ నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్‌ 584 పరుగుల భారీ స్కోరు సాధించగా.. కర్ణాటక 293 పరుగులకే ఆలౌటైంది. జమ్మూకశ్మీర్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన శుభమ్‌ పుందిర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా.. ఈ రంజీ సీజన్లో 60 వికెట్లు పడగొట్టడమే కాక, 245 పరుగులు చేసిన ఆకిబ్‌ నబి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 584; కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: 293; జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌: 342/4 డిక్లేర్డ్‌ (కమ్రాన్‌ ఇక్బాల్‌ 160 నాటౌట్, సాహిల్‌ లోత్రా 101 నాటౌట్‌; ప్రసిద్ధ్‌ కృష్ణ 2/42) రంజీ ట్రోఫీ గెలిచిన 18వ జట్టు జమ్మూకశ్మీర్‌.