Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

శ్రీలంకలో భారత్‌ నిర్మించిన బెయిలీ వంతెన ప్రారంభం

భారత సహకారంతో శ్రీలంకలో నిర్మించిన మొదటి బెయిలీ వంతెన (తాత్కాలిక వంతెన)ను 2026, జనవరి 11న ప్రారంభించారు. సెంట్రల్‌ ప్రావిన్స్‌-ఉవా ప్రావిన్స్‌ మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న రహదారి అనుసంధానం 2025, నవంబరులో వచ్చిన దిత్వా తుపానుతో ధ్వంసమైంది. అనంతర కాలంలో శ్రీలంకలో పర్యటించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అక్కడ దెబ్బతిన్న రోడ్లు, రైల్వే లైన్ల పునరుద్ధరణకు ‘ఆపరేషన్‌ సాగర బంధు’ పేరుతో రూ.45 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. దీని కింద భారత సైన్యం ఈ బెయిలీ వంతెనను నిర్మించింది.

Current Affairs

నళినీ జోషికి

భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ నళినీ జోషికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో 2025కుగాను ప్రతిష్ఠాత్మక ‘న్యూ సౌత్‌వేల్స్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూ) సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ఆమెను వరించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి గణిత శాస్త్రవేత్త నళినీయే. ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ పూర్తిచేశారు. సిడ్నీలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 

Current Affairs

అరుణాచల్‌ప్రదేశ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు కొత్తరకం కప్పలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని జీనస్‌ లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని, మెచుకాగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి కప్పలు 39 ఉండగా, వాటిలో నాలుగు భారత్‌లోనే ఉన్నాయి.  దిల్లీ విశ్వవిద్యాలయం, పర్యావరణ విద్య విభాగం, హార్వర్డ్‌ యూనివర్సిటీలోని మ్యూజియం ఆఫ్‌ కంపారిటివ్‌ జువాలజీలకు చెందిన పరిశోధకులు వీటిని కనుగొన్నారు.

Current Affairs

కేరళ

కేరళలోని కన్నూర్‌ జిల్లా ఆరళంలో ఉన్న దేశంలోనే తొలి సీతాకోకచిలుకల అభయారణ్యం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 2025లో ఆరళం అభయారణ్యాన్ని సీతాకోకచిలుకల పెంపకం, వలసలకు ముఖ్యమైన ప్రదేశంగా గుర్తించాలని ప్రకటించింది. వలస జీవులైన ఆల్బాట్రాస్‌ సీతాకోకచిలుకలు పశ్చిమ కనుమల నుంచి ఆరళం ప్రాంతానికి వేలల్లో తరలివస్తాయి. తేమతో కూడిన నేల లేదా నది ఒడ్డున ఉన్న బురద నుంచి ఖనిజాలు, లవణాలను గ్రహించడానికి వేలల్లో సీతాకోకచిలుకలు ఒకే ప్రదేశానికి వస్తాయి. దీన్నే ‘సాయిల్‌ పడలింగ్‌’ అంటారు. 

Current Affairs

గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఏపీ

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ ‘గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (మహా హరిత కుడ్యం)’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీరప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్‌ ఏర్పాటు చేయనుంది. దీన్ని తీరానికి బయోషీల్డ్‌గా (జీవ రక్షణ కవచం) తీర్చిదిద్దినుంది. మొత్తం మూడు జోన్లతో గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యాంశాలు: ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ముప్పును అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. రాష్ట్రంలో తీరప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు: 33 లక్షల మంది కోతకు గురవుతున్న తీరప్రాంతం: 32% మేర

Current Affairs

ప్రపంచ హిందీ దినోత్సవం

మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని కేవలం భాషగానే కాకుండా తమ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. భారత సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మన రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. హిందీ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పే లక్ష్యంతో ఏటా జనవరి 10న ‘ప్రపంచ హిందీ దినోత్సవం’గా(World Hindi Day) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు ఈ భాష మాట్లాడే సమూహాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే లక్ష్యంతో 1975, జనవరి 10న నాగ్‌పుర్‌లో మొదటి హిందీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.  ఈ సదస్సు జరిగిన జ్ఞాపకార్థం ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం (విశ్వ హిందీ దివస్‌)గా జరపాలని 2006లో అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 

Current Affairs

ఆదిత్య-ఎల్‌1

శక్తిమంతమైన సౌర తుపాన్ల కారణంగా.. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి  ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. సౌర తుపానులోని తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉంటున్నట్లు వెల్లడైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది.  ఆదిత్య-ఎల్‌1 అనేది భారత తొలి సౌర పరిశీలక ఉపగ్రహం. 2024 అక్టోబరులో వచ్చిన సౌర తుపానుకు సంబంధించిన డేటాను ఇది అందించింది. దాన్ని, ఇతర అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లు అందించిన వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో వెలువడిన సౌర ప్లాస్మా ప్రభావాన్ని పరిశీలించారు. సౌర తుపానుకు సంబంధించిన అల్లకల్లోల ప్రాంతం.. పుడమి అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రస్థాయిలో సంకోచింపచేస్తున్నట్లు గుర్తించారు. 

Current Affairs

వ్యవసాయంలో చరిత్రాత్మక వృద్ధి

2014-15 నుంచి 2024-25 వరకు పదేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూలేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ సమయంలో వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసిందని, ఇది గతంలో ఎన్నడూ లేదని తెలిపింది. ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ దేశాలతో పోలిస్తే ఇది అత్యధికమని తెలిపింది. చైనా సాధించిన 4.10% వృద్ధిరేటు కంటే ఇది అధికమని పేర్కొంది. 2015-16 నుంచి 2024-25 మధ్య ఏ ఒక్క ఏడాదీ ప్రతికూల వృద్ధి నమోదు కాలేదని తెలిపింది.  మత్స్యరంగం 9% వృద్ధి సాధించింది. పంటలతో పోలిస్తే ఇది రెట్టింపునకంటే ఎక్కువ.  అటవీ ఉత్పత్తుల వృద్ధి కూడా దాదాపు 4 శాతానికి చేరింది. 

Current Affairs

పెరిగిన బియ్యం ఎగుమతులు

2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంతో పోలిస్తే, ఇవి 19.4% అధికం. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 25% వృద్ధితో 151.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు, బాస్మతీ బియ్యం 8% పెరిగి 64 లక్షల మెట్రిక్‌ టన్నులు తరలి వెళ్లినట్లు వివరించింది. ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ఇది సాధ్యమైంది. దేశీయంగా దిగుబడులు పెరిగినందునే, బియ్యం ఎగుమతులకు మన ప్రభుత్వం అనుమతించింది.

Current Affairs

అరుణాచల్‌లో కాగితం లాంటి పుట్టగొడుగులు

సన్నగా కాగితంలా ఉండే ‘ప్లీటెడ్‌ ఇంక్‌క్యాప్‌’ పుట్టగొడుగులను అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్‌ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రం ఐసీఏఆర్‌-కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే)లో ఈ తరహా పుట్టగొడుగులను కనుకుకన్నారు. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘పారాసోలా ప్లికాటిలిస్‌’. దీని జీవితకాలం 24 గంటల కంటే తక్కువే. సన్నగా కాగితంలా బూడిద రంగులో ఉండే క్యాప్, పెళుసైన కొమ్మలతో ఈ పుట్టగొడుగు కనిపిస్తుంది. నేలలో పోషకాల పునర్వినియోగాన్ని మెరుగుపరిచే ఎంజైమ్‌లను విడుదల చేయడం ద్వారా రాలిపోయిన ఆకులను, సేంద్రియ పదార్థాలు భూమిలో కలిసిపోయేందుకు ఈ పుట్టగొడుగు సాయపడుతుంది.