ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో 2026, ఫిబ్రవరి 14న వరుసగా మూడో ఏడాది రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205.34 కోట్ల అంచనా వ్యయంతో పద్దును సమర్పించారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు; ద్రవ్యలోటు రూ.75,868.09 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.2,34,140.14 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.2,17,976 కోట్లు రెవెన్యూ రాబడిని ఆశిస్తే 2026 జనవరి నెలాఖరు వరకు వచ్చింది రూ.1,40,000 కోట్లే.
రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.53,915 కోట్లను మూలధన వ్యయంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది.
‘సూపర్ సిక్స్’కు పెద్దపీట..
‘సూపర్ సిక్స్’ పేరిట అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.27,719 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం కింద రూ.9,668 కోట్లు ఇచ్చారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు సాయం చేసేందుకు రూ.6,600 కోట్లు కేటాయించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు దీపం 2.0 పథకం కింద రూ.2,601 కోట్లు కేటాయించారు.
మహిళలు, యువతులు, తదితరులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.1,420 కోట్లు, బలహీనవర్గాల వారికి ఉచిత విద్యుత్తు, రాయితీపై విద్యుత్తు ఇచ్చేందుకు రూ.600 కోట్లు బడ్జెట్లో చూపారు. వివిధ సామాజికవర్గాల వారికి ఆర్థిక సాయం చేసేందుకు రూ.2,320 కోట్లు కేటాయించారు.
ఆటోడ్రైవర్లకు సేవలో కార్యక్రమానికి రూ.450 కోట్లు, మత్స్యకార సేవలో కార్యక్రమానికి రూ.260 కోట్లు, ఉపకార వేతనాలకు రూ.3,836 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.2,161 కోట్లు నిధులిచ్చారు.