Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యం

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఆర్గనైజేషన్స్‌ విభాగం డీజీపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకాతిరుమలరావు పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును ఇన్‌ఛార్జ్‌ ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యంను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ 2026, ఫిబ్రవరి 13న ఉత్తర్వులు జారీ చేశారు. 

Current Affairs

స్టార్టప్‌ ఇండియా 2.0

స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం రెండో దశ (2.0)కు రూ.10,000 కోట్ల మూలనిధితో ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ప్రారంభ దశల్లో, డీప్‌-టెక్‌ పరిశోధనల్లో ఉన్న అంకుర సంస్థలకు ఇది ప్రోత్సాహం ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నూతన కార్యాలయం ‘సేవా తీర్థ్‌’లో మొదటి రోజున పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, యువ శక్తి, నారీ శక్తికి సంబంధించిన దస్త్రాలపై మోదీ సంతకం చేశారు. స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ 2.0కు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ తెలిపారు.

Current Affairs

లీడ్‌ బ్యాంక్‌ పథకం

జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 1969లో ప్రవేశపెట్టిన లీడ్‌ బ్యాంక్‌ పథకం (ఎల్‌బీఎస్‌)లో మార్పులు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను సవరిస్తూ 2026, ఫిబ్రవరి 13న ముసాయిదాను విడుదల చేసింది. బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, ఇతర అభివృద్ధి సంస్థలను సమన్వయం చేస్తూ, ప్రాధాన్య రంగాలకు రుణ మంజూరును పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. తాజా ప్రతిపాదనల ప్రకారం.. పథకం లక్ష్యాలు, నిర్మాణం, సభ్యత్వం, వివిధ వేదికల అజెండా, కీలక అధికారుల బాధ్యతలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ), లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ కార్యాలయాలను బలోపేతం చేయడం లాంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.

Current Affairs

బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్‌

బంగ్లాదేశ్‌ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల స్థానాల్లో నెగ్గి.. రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బీఎన్‌పీ ఛైర్మన్‌ తారిఖ్‌ రెహమాన్‌(60) దేశ నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగిన 299 పార్లమెంటు స్థానాల్లో 209 సీట్లలో బీఎన్‌పీ విజయఢంకా మోగించింది. పాకిస్థాన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న మతతత్వ పార్టీ జమాత్‌-ఏ-ఇస్లామీ 68 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.   చివరిసారిగా బీఎన్‌పీ 2001లో అధికారంలోకి వచ్చింది. 2006 వరకు కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీయే నెగ్గుతూ వచ్చింది. 

Current Affairs

ప్రధాని కొత్త కార్యాలయం

కొత్తగా నిర్మించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) - సేవా తీర్థ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 13న ప్రారంభించారు. సేవా తీర్థ్‌లో ప్రధాని కార్యాలయంతోపాటు జాతీయ భద్రత మండలి సెక్రటేరియట్, క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ ఉంటాయి. దీంతో పాటు కేంద్ర సచివాలయ భవనాలైన కర్తవ్య భవన్‌-1, కర్తవ్య భవన్‌-2లనూ ఆయన ప్రారంభించారు.  కర్తవ్య భవన్‌లు 1, 2లలో న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయశాఖలతోపాటు పలు శాఖల కార్యాలయాలుంటాయి. ఈ రెండు భవనాలు డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్‌గా ఉంటాయి.  1921 నుంచీ దేశంలో అధికార కేంద్రాలుగా ఉన్న చారిత్రక సౌత్‌బ్లాక్, నార్త్‌బ్లాక్‌ భవనాలను మ్యూజియంగా మారుస్తామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.100 ప్రత్యేక నాణాన్ని విడుదల చేశారు. 

Current Affairs

ఆర్‌ఏఎఫ్‌ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్‌

బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) తొలిసారి సిద్ధమైంది. దిల్లీ వేదికగా 2026, ఫిబ్రవరి 12న జరిగిన 19వ బ్రిటన్‌-భారత్‌ వైమానిక సిబ్బంది చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్‌ వ్యాలీలో ముగ్గురు క్వాలిఫైడ్‌ ఫ్లైట్‌ ఇన్‌స్ట్రక్టర్లను ఐఏఎఫ్‌ ప్రాథమికంగా రెండేళ్ల పాటు విధుల్లో ఉంచనుంది. 

Current Affairs

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ స్వర్ణం నెగ్గాడు. 2026, ఫిబ్రవరి 12న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అతడు 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మిగతా రెండు పతకాలు భారత్‌కే దక్కాయి. నీరజ్‌ కుమార్‌ (361.8), అఖిల్‌ షెరోన్‌ (343.5) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో టీమ్‌ స్వర్ణం కూడా భారత్‌కే లభించింది. 

Current Affairs

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని.. దిగుమతులు రాణించినా కూడా, ఏడాది వ్యవధిలోనే మనకు వాణిజ్య మిగులు 90 బిలియన్‌ డాలర్లు (రూ.8.19 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఏడాది వ్యవధిలో అగ్రగామి 15 వస్తువుల ఎగుమతులే 97 బి. డాలర్లకు చేరతాయని, మిగతా వస్తువులూ కలిపితే ఏటా 100 బి. డాలర్ల మార్కును చేరొచ్చని వివరించింది.   2024-25లో అమెరికాతో మనకు 40.9 బి.డాలర్ల మిగులు ఉండగా, 2025-26లో ఏప్రిల్‌-డిసెంబరు కాలానికి 26 బి.డాలర్లుగా ఉంది. 

Current Affairs

రక్షణ రంగం

భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2026, ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. భారత వాయుసేనకు (ఐఏఎఫ్‌) మరో 114 శత్రుభీకర రఫేల్‌ యుద్ధవిమానాలు చేర్చే ప్రతిపాదన అందులో ఉంది. ఇందుకోసం ఫ్రాన్స్‌ సర్కారుతో కేంద్ర ప్రభుత్వం భారీస్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. మొత్తం రూ.3.60 లక్షల కోట్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్‌ కొనుగోళ్లకు డీఏసీ తాజాగా ఆమోదం తెలిపింది. రఫేల్‌ యుద్ధవిమానాలతో పాటు.. వాయుసేన కోసం క్షిపణులు, ఎయిర్‌-షిప్‌ బేస్డ్‌ హై ఆల్టిట్యూట్‌ సూడో శాటిలైట్‌ (ఏఎస్‌-హెచ్‌ఏపీఎస్‌), నౌకాదళం కోసం ఆరు అమెరికా తయారీ బోయింగ్‌ పీ8-ఐ నిఘా విమానాలు, సైన్యం కోసం వైభవ్‌ యాంటీ ట్యాంక్‌ మైన్ల కొనుగోలు, టీ-72 ట్యాంకుల మరమ్మతుల లాంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. 

Government Jobs

నేషనల్ హెల్త్ మిషన్ చిత్తూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ఒప్పంద  ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాలు  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 07 వివరాలు: 1. డేటా మేనేజర్  - 01 2. డేటా ఎంట్రీ ఆపరేటర్  - 03 3. మైక్రోబయాలజిస్ట్   - 01 4. ల్యాబ్ టెక్నీషియన్ - 01 5. ల్యాబ్ అటెండెంట్  - 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్/డిప్లొమా/డిగ్రీ/బీఈ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 28-01-2026 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.15,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌ఓ)కార్యాలయం, చిత్తూరు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20-02-2026. Website:https://chittoor.ap.gov.in/notice_category/recruitment/