Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌

ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్‌టీఈఎం) విభాగాల్లోని అన్ని స్థాయుల్లో నేటికీ గణనీయమైన లింగ అంతరం కొనసాగుతోంది. స్త్రీలు విద్యలో రాణించడంతోపాటు ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నాయకత్వ స్థాయికి ఎదగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. శాస్త్రీయ రంగాల్లో బాలికలు, మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా నిర్వహిస్తారు. ఎస్‌టీఈఎం రంగాల్లో విజయవంతమైన స్త్రీలను  గౌరవించుకోవడంతోపాటు వారి సహకారాన్ని గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం 2013, డిసెంబరు 20న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ‘అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణ’ అనే తీర్మానాన్ని ఆమోదించింది. అందులో లింగ సమానత్వం, మహిళలు - బాలికల సాధికారతకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆవిష్కరణల్లో సమాన అవకాశాలు, భాగస్వామ్యం తప్పనిసరని పేర్కొంది. ఈ భావనను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా జరుపుకోవాలని 2015లో ప్రకటించింది. 2026 నినాదం: “Synergizing AI, Social Science, STEM and Finance: Building Inclusive Futures for Women and Girls.”

Current Affairs

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.కృష్ణ భాస్కర్‌ను రిలీవ్‌ చేసింది. బుద్ధప్రకాశ్‌ ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈయన్ను సీఎండీగా నియమిస్తూ 2026, ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.  

Current Affairs

జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో కొత్త పరిపాలన వ్యవస్థ ఆరంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం, మూడింటికీ ప్రత్యేక అధికారి నియామకం, పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన పలు ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రస్తుత కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ నూతన జీహెచ్‌ఎంసీ పగ్గాలు చేపట్టారు. సైబరాబాద్‌ నగరపాలక సంస్థ(సీఎంసీ) కమిషనర్‌గా జి.సృజన హైటెక్‌సిటీలోని న్యాక్‌ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. తార్నాక చౌరస్తాలోని పాత హెచ్‌ఎండీఏ భవనంలో ఏర్పాటైన మల్కాజిగిరి నగరపాలక సంస్థ(ఎంఎంసీ) కార్యాలయంలో టి.వినయ్‌కృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. 2026, ఫిబ్రవరి 10తో గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలకమండలి గడువు పూర్తయినందున... మేయర్‌ స్థానంలో స్పెషల్‌ ఆఫీసర్‌గా పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మూడు కార్యాలయాలకు వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు.

Current Affairs

ముంబయి

భారత్‌లో తొలి మ్యూజికల్‌ రోడ్డును ప్రారంభించి ముంబయి తీరప్రాంత రహదారుల అధికారులు రికార్డు సృష్టించారు. హంగేరియన్‌ టెక్నాలజీ సాయంతో నారిమన్‌ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే రహదారిపై పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డుపై దాదాపు 500 మీటర్ల మేర వాహనదారులకు ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ సినిమాలోని ‘జయ హో’ పాట వినిపించనుంది. వాహనాలు 70 - 80 కి.మీ.ల వేగంతో ప్రయాణించినప్పుడు రోడ్డుపై ఉన్న ప్రత్యేక పట్టీల రాపిడికి ‘జయహో’ అని ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంచేందుకు ఈ విధంగా డిజైన్‌ చేసినట్లు ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

Current Affairs

ప్రత్యక్ష పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2024-25 ఇదే సమయంలోని పన్ను వసూళ్లతో పోలిస్తే ఇవి 9.4% అధికం. కార్పొరేట్‌ పన్ను వసూళ్లు అధికంగా నమోదవడం ఇందుకు దోహదం చేసింది. ఆదాయ పన్ను విభాగం 2026, ఫిబ్రవరి 11న విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 14.51% వృద్ధితో రూ.8.9 లక్షల కోట్లకు చేరుకోగా, నాన్‌-కార్పొరేట్‌ (వ్యక్తిగత, హిందు అవిభాజ్య కుటుంబాలు సహా) విభాగం నుంచి 5.91% అధికంగా రూ.10.03 లక్షల కోట్లకు చేరాయి. పన్ను రిఫండ్‌ల జారీ 18.82% తగ్గి రూ.3.34 లక్షల కోట్లకు పరిమితమైంది. 

Current Affairs

నీటి అడుగున పనిచేసే డ్రోన్‌

గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన జ్ఞానమంజరి ఇన్నోవేటివ్‌ యూనివర్సిటీ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు నీటి అడుగున పనిచేసే డ్రోన్‌కు రూపకల్పన చేశారు. జాతీయ రక్షణ అవసరాలకు, పరిశ్రమల్లోనూ దీనిని ఉపయోగించవచ్చన్నారు.  యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు దీనిని ప్రదర్శించారు. రసాయన పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించినట్లు వెల్లడించారు. 

Current Affairs

‘అరణ్యరామం’

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ‘అరణ్యరామం’ పేరిట అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని (ప్రీమియర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఫారెస్ట్రీ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేయనుంది. తాడేపల్లి రక్షిత అటవీ ప్రాంతంలోని 132వ కంపార్ట్‌మెంట్‌లో హెక్టార్‌ విస్తీర్ణంలో దీన్ని నెలకొల్పుతారు. రూ.24 కోట్ల వ్యయంతో 48 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో భవనాలు నిర్మిస్తారు. ఈ మేరకు అటవీ దళాల అధిపతి నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే 2026, ఫిబ్రవరి 11న ఉత్తర్వులిచ్చారు.

Current Affairs

ఉదయ్‌ నాగరాజు

శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువసభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు 2026, ఫిబ్రవరి 11న జీవితకాల సభ్యుడి (లైఫ్‌ పీర్‌)గా ప్రమాణం చేశారు. బ్రిటిష్‌ సంప్రదాయాల మేరకు జరిగిన వేడుకలో ముదురు ఎరుపు రంగు గౌను ధరించి, భగవద్గీతపై ఆయన ప్రమాణం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌ నాగరాజు.. దాదాపు 25 ఏళ్ల క్రితం బ్రిటన్‌ వెళ్లారు. మహాత్మాగాంధీ ఫ్యూచర్‌ లీడర్స్‌ ప్రోగామ్‌ వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయ విలువలను పెంపొందించడంలో కృషిచేస్తున్నారు.

Current Affairs

ప్రసన్నకుమార్‌

‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ డి.ప్రసన్న కుమార్‌ ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఏపీ నుంచి ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి ఈయనే. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం గ్రామం ఆయన స్వస్థలం. సీఏలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 1985లో విశాఖలో స్థిరపడ్డారు. 

Internship

డివైన్‌ ఇన్‌ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

డివైన్‌ ఇన్‌ఫ్రా కంకెనీ వీడియో ఎడిటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: డివైన్‌ ఇన్‌ఫ్రా పోస్టు పేరు: వీడియో ఎడిటింగ్‌  నైపుణ్యాలు: వీడియో ఎడిటింగ్‌లొ నైపుణ్యం ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు రూ.2,500 - రూ.5,000. వ్యవధి: 4 నెలలు దరఖాస్తు గడువు: 05-03-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-video-editing-using-ai-tools-only-internship-at-divine-infra1770118540