Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

రాష్ట్ర సూక్ష్మజీవి

కేరళ ప్రభుత్వం బ్యాసిలస్‌ సబ్టిలస్‌ అనే బ్యాక్టీరియంను ‘రాష్ట్ర సూక్ష్మజీవి’గా ప్రకటించింది. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ చర్యను చేపట్టింది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో సూక్ష్మజీవుల పాత్రపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను సమాజహితానికి అందుబాటులోకి తీసుకురావడానికి ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మైక్రోబయోమ్‌’ను కూడా ప్రారంభించింది. భారత్‌కు ఇప్పటికే ల్యాక్టోబ్యాసిలస్‌ బల్గేరికస్‌ను జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించింది. ఒక రాష్ట్రం కూడా  ఆ బాటలో పయనించడం ఇదే మొదటిసారి. 

Current Affairs

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ నియమితులయ్యారు. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేయగా, ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Current Affairs

క్యాన్సర్‌ అట్లాస్‌

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులను గుర్తించేందుకు ప్రత్యేకంగా అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) 4.0 సర్వే చేపడుతున్న ప్రభుత్వం.. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్‌ అట్లాస్‌ను రూపొందించింది. క్యాన్సర్‌ను నోటిఫై వ్యాధిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా రూపొందించిన అట్లాస్‌ ద్వారా ఎక్కడికక్కడ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రాధాన్య అంశాలు నిర్దేశించుకుంది.  క్యాన్సర్‌ అట్లాస్‌లో పేర్కొన్న గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యాధి పీడితులు ఉన్నారు. అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో (8,101) ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో (1,495) ఉన్నాయి. పీడితుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. 50-59 ఏళ్ల వయసు వారు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

Current Affairs

‘బ్యాగేజీ నిబంధనలు 2026’

2016 నాటి పాత నిబంధనల స్థానంలో, రూపొందించిన ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ 2026, ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. దీని ప్రకారం, విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల్లో మనదేశానికి వచ్చే మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ, తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు. ఈ ఆభరణాలు కచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపు లభించదు. ఇప్పటివరకు మహిళలు రూ.లక్ష, పురుషులు రూ.50 వేల విలువైన ఆభరణాలే ఇలా తెచ్చుకోవచ్చు. 

Current Affairs

భారత ఉత్పత్తులపై 18 శాతం సుంకం

భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రతీకార సుంకాలనూ 18 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేయడానికి భారత్‌ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్‌ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్‌ ఉత్పత్తులపై పడుతున్న 50 శాతం(ఇందులో రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకం ఉంది) సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి. 

Current Affairs

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే

భారతదేశం చుట్టూ మూడువైపులా సముద్రంతో అతిపెద్ద తీర రేఖను కలిగి ఉంది. దీంతో సముద్ర ప్రయోజనాలను కాపాడటం, మారిటైం (అడ్మిరల్టీ) చట్టాలను కచ్చితత్వంతో అమలు చేయడం ముఖ్యం. ఇందుకోసం ఏర్పాటైందే భారత తీర రక్షక దళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌). భారత తీరాలను సురక్షితంగా ఉంచడంలో, సముద్ర మండలాల్లో నిబంధనలను అమలు చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తోంది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా మన దేశంలో ఫిబ్రవరి 1న ‘భారత తీర రక్షక దళ దినోత్సవం’గా (ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే) నిర్వహిస్తున్నారు. సముద్ర సమగ్రతను కాపాడటంతోపాటు జాతీయ భద్రతను ప్రోత్సహించడంలో కోస్ట్‌ గార్డ్‌ పాత్రను గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: సముద్ర మార్గాల ద్వారా జరుగుతోన్న అక్రమ రవాణాను అడ్డుకోవడం, తీర ప్రాంతాల రక్షణే ధ్యేయంగా భారత ప్రభుత్వం 1977, ఫిబ్రవరి 1న భారత తీర రక్షక దళాన్ని ఏర్పాటు చేసింది. 1978, ఆగస్టు 18న భారత పార్లమెంట్‌ కోస్ట్‌ గార్డ్‌ చట్టం, 1978కి ఆమోదం తెలిపింది. తద్వారా దాని కార్యకలాపాలకు చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ లభించింది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ఏర్పాటుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 1న ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే’గా నిర్వహించాలని 1978లో భారత ప్రభుత్వం తీర్మానించింది.

Current Affairs

‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’

పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఆదంపుర్‌ విమానాశ్రయం పేరును ‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’గా మార్చారు. ఆయన 15 శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ కవి, సంస్కర్త. గురు రవిదాస్‌ జయంతి రోజు ఈ పేరును ఆవిష్కరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2026, ఫిబ్రవరి 1న ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు రవిదాస్‌ 649వ జయంతి సభలో ఆయన ప్రసంగించారు. 

Current Affairs

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అల్కరాస్‌

స్పెయిన్‌కి చెందిన కార్లోస్‌ అల్కరాస్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. 2026, ఫిబ్రవరి 1న మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అల్కరాస్‌ 2-6, 6-2, 6-3, 7-5తో పదిసార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. అల్కరాస్‌ మ్యాచ్‌లో 9 ఏస్‌లు సంధించాడు. 36 విన్నర్లు కొట్టాడు.  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడడం మాజీ నంబర్‌వన్‌ జకోవిచ్‌కు ఇదే తొలిసారి. ఇంతకుముందు ఫైనల్‌ చేరిన పదిసార్లూ అతడు విజేతగా నిలిచాడు.

Current Affairs

పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం

సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం, పాన్‌ మసాలాపై ఆరోగ్య సెస్‌ 2026, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్‌టీ రేటుకు మించి అత్యధికంగా 40 శాతం వీటిపై సుంకం విధించారు. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వస్తువులపై ఉన్న 28 శాతం జీఎస్‌టీ, పరిహార సెస్‌ను ఎక్సైజ్‌ సుంకాలు, ఆరోగ్య సెస్‌ భర్తీ చేస్తాయి.  పొగాకు ఉత్పత్తులకు (నమిలే పొగాకు, ఫిల్టర్‌ ఖైనీ, జర్దా సెంటెడ్‌ పొగాకు, గుట్కా) కొత్త ఎంఆర్‌పీ ఆధారిత మూల్యాంకన విధానం ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ప్యాకేజీపై ప్రకటించిన రిటెయిల్‌ అమ్మకపు ధర ఆధారంగా జీఎస్‌టీ నిర్ణయిస్తారు. 

Current Affairs

16వ ఆర్థిక సంఘం సిఫార్సు

కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41 శాతంగా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోతపెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కనబెట్టింది. దీనికితోడు రంగాలవారీ, రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకూ తెరదించింది. దీనివల్ల గత ఐదేళ్లతో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాలు నికరంగా రూ.4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది.