Posts

Current Affairs

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

మంచి ఆహార అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్‌ 7న ‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’గా నిర్వహిస్తారు. జీవులు ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని సాగించాలంటే ఆహార భద్రత అవసరం. ఇది లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. ప్రజల రోగనిరోధక శక్తి క్షీణించి, వ్యాధులు సంక్రమిస్తాయి. ఆహార వృథాను అరికట్టడంపైనా ఈ రోజు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంది. చారిత్రక నేపథ్యం: యూఎన్‌ఓకి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ), డబ్ల్యూహెచ్‌ఓ 2016లో సంయుక్తంగా ఆహార భద్రత ప్రాముఖ్యం గురించి ప్రజలకు తెలియజేయాలని భావించాయి. దీనికోసం ఒక రోజును ఏర్పాటు చేయాలనుకున్నాయి. 2017, జులైలో జరిగిన ఎఫ్‌ఏఓ 40వ సర్వసభ్య సమావేశంలో ఏటా జూన్‌ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. అదే ఏడాది డిసెంబరులో ఆ తీర్మానానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు ప్రకటించింది. 2018, డిసెంబరు 20న జరిగిన యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీలోనూ దీనికి ఆమోదం లభించింది. 2019 నుంచి ఏటా జూన్‌ 7న ఈ రోజును నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: Food safety: science in action

Current Affairs

దేశంలో అత్యంత పేదరికం 5.3 శాతం

భారత్‌లో అత్యంత పేదరిక (ఎక్స్‌ట్రీమ్‌ పావర్టీ) రేటు వేగంగా తగ్గి 5.3 శాతానికి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. 2011-12లో ఇది 27.1 శాతం కాగా, దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. రోజుకు 3 డాలర్ల (రూ.255) కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్న వారిగా ప్రపంచ బ్యాంక్‌ నిర్వచించింది. 2021లో ఈ పరిమితి 2.15 డాలర్లుగా ఉంది. సవరించిన తర్వాత 15 శాతం పెంచి 3 డాలర్లుగా చేసింది. అయినప్పటికీ మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న వారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది.  2021 పరిమితి ప్రకారం చూస్తే అత్యంత పేదరికంలో ఉన్న వారు 16.2 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గారు. 2024లో 3 డాలర్ల పరిమితి వద్ద అత్యంత పేదరిక రేటు 5.44 శాతంగా ఉంది.

Current Affairs

ట్రాన్స్‌పాండర్‌

చేపల వేటకు సముద్రంలోకి వెళ్లినప్పుడు మత్స్యకారులు ఎదుర్కొంటోన్న ముప్పులను తగ్గించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ట్రాన్స్‌పాండర్‌’ అనే కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఒక ఉపగ్రహ ఆధారిత సముద్రయాన భద్రత వ్యవస్థ. ఈ టెక్నాలజీని పశ్చిమ బెంగాల్‌లోని కాక్‌ద్వీప్‌ సబ్‌డివిజన్‌లో తాజాగా ప్రారంభించారు. ఆ పరికరాన్ని ప్రారంభ దశలో 300 పడవల్లో ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అన్ని ట్రాలర్లలో ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ యోచిస్తోంది. ఎలా పనిచేస్తుంది?.. ట్రాన్స్‌పాండర్‌ పరికరం మొబైల్‌ నెట్‌వర్క్‌పై ఆధారపడదు. నేరుగా ఉపగ్రహానికి అనుసంధానమై ఉంటుంది. తద్వారా మత్స్యకారులు సముద్రంలోని ఏ మూల నుంచి అయినా తీరప్రాంత అధికారులకు అత్యవసర సందేశాలను పంపగలరు.

Current Affairs

సీఆర్‌ఎస్‌ నివేదిక

పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్‌) 2022లో నమోదైన మరణాల గురించి వివరిస్తూ 2025, జూన్‌ 7న నివేదికను విడుదల చేసింది. ఆ ఏడాది దాదాపు 86.5 లక్షల సాధారణ మరణాలు సంభవించినట్లు సీఆర్‌ఎస్‌ వెల్లడించింది. కరోనా ఉద్రిక్త స్థాయిలో ఉన్న 2021లో మరణించిన 1.02 కోట్ల మందితో పోలిస్తే ఇది 15 శాతం తక్కువ అని పేర్కొంది. 2018లో 69.5 లక్షలు, 2019లో 76.4 లక్షలు, 2020లో 81.1 లక్షల సాధారణ మరణాలు నమోదవగా.. 2021లో 1.02 కోట్ల మరణాలు సంభవించాయి. 

Apprenticeship

హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు మహారాష్ట్రలోని ఎంఐడీసీ తలోజాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన తలోజా కాపర్ ప్రాజెక్ట్ ట్రేడ్‌ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్: 10 పోస్టులు ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ప్లంబర్. అర్హత: ఎనిమిది, 10వ తరగతి, సంబంధిత ట్రే డులో ఐటీఐ ఉత్తీర్ణత. వయోపరిమితి: 01-05-2025 నాటికి 21 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2025. Website:https://www.hindustancopper.com/

Current Affairs

టి.రబిశంకర్‌

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రబిశంకర్‌ 2025, జూన్‌ 7న 16వ ఆర్థిక సంఘం పార్ట్‌టైం సభ్యుడిగా నియమితులయ్యారు. కమిషన్‌ తన తుది నివేదికను అందించే అక్టోబరు 31వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివకు కమిషన్‌ ఫుల్‌టైం సభ్యుడిగా ఉన్న అజయ్‌నారాయణ్‌ ఝా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రబిశంకర్‌ను నియమించారు.

Current Affairs

‘ససాకవా’ అవార్డు

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రకు ప్రతిష్ఠాత్మక ‘ససాకవా’ పురస్కారం దక్కింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌(యూఎన్‌డీఆర్‌ఆర్‌)’ కార్యాలయం ఆయన్ను ఈ అవార్డుతో సత్కరించింది. 2025, జూన్‌ 7న జెనీవాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఉష్ణమండల తుపానుల అంచనా, హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి ఆయన చేసిన కృషికిగానూ ఈ గౌరవం దక్కింది.

Current Affairs

అత్యంత పొడవైన కేబుల్‌ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్‌

ఝర్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్‌ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. సిరంటోలీ ఏరియా నుంచి భారత ప్రభుత్వరంగ సంస్థ మెకాన్‌ వరకు ఫ్లైఓవర్‌ను నిర్మించారు. అందుకే దీన్ని సిరంటోలీ - మెకాన్‌ ఫ్లైఓవర్‌ అని పిలుస్తున్నారు. ఈ వంతెనకు ప్రముఖ గిరిజన నాయకుడు కార్తీక్‌ ఒరాన్‌ పేరు పెట్టారు.  రాంచీ పరిధిలోని రైల్వేలైన్‌పై 132 మీటర్లు పొడవునా కేబుల్స్‌ను దన్నుగా చేసుకొని నిలిచేలా ఈ వంతెనను నిర్మించారు. 

Current Affairs

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత కొకో గాఫ్‌

ప్రపంచ నంబర్‌ 2 కొకో గాఫ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 2025, జూన్‌ 7న పారిస్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆమె 6-7 (5-7), 6-2, 6-4తో టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది. మ్యాచ్‌లో గాఫ్‌ మూడు ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది. రెండు ఏస్‌లు, 37 విన్నర్లు కొట్టిన సబలెంకా.. ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసింది. సబలెంకా 6, గాఫ్‌ 8 డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు.   గాఫ్‌కు కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌. ఇంతకుముందు 2023లో యుఎస్‌ ఓపెన్‌ గెలిచింది. అప్పుడు కూడా ఆమె ఫైనల్లో సబలెంకాపై నెగ్గింది. గాఫ్‌ 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది.

Current Affairs

ఓపెన్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌

ఆసియా ఛాంపియన్‌ జ్యోతి యర్రాజి తైవాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో స్వర్ణం నెగ్గింది. 2025, జూన్‌ 7న తైపీ సిటీలో జరిగిన 100మీ. హర్డిల్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. జ్యోతి 12.99 సెకన్లలో రేసును పూర్తి చేసింది. ఆమె ఇటీవల దక్షిణ కొరియాలో ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి గెలిచింది. జాతీయ రికార్డు (12.78సె) ఆమె పేరిటే ఉంది.  తైవాన్‌ ఓపెన్‌లో భారత్‌ మొత్తం ఆరు స్వర్ణాలు నెగ్గింది.