Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

‘జీవన్‌దాన్‌’

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జీవన్‌దాన్‌’ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అవయవదానంలో ‘జీవన్‌దాన్‌’ సరికొత్త రికార్డు సృష్టించింది. జీవన్మృతులైన 93 మంది నుంచి సేకరించిన అవయవాలతో 301 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. రాష్ట్రంలో జీవన్‌దాన్‌ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు 1,296 అవయవాలు సేకరించారు. ఈ పదేళ్లలో జీవన్మృతులైన 403 మంది నుంచి 703 కిడ్నీలు, 316 కాలేయాలు, 181 ఊపిరితిత్తులు, 91 గుండెలు తదితరాలు సేకరించారు. 

Current Affairs

వరల్డ్‌ వెదర్‌ అట్రిబ్యూషన్‌ సంస్థ నివేదిక

2025లోనూ ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 157 ప్రకృతి వైపరీత్యాలు కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు వరల్డ్‌ వెదర్‌ అట్రిబ్యూషన్‌ సంస్థ నివేదిక పేర్కొంది. 2024లో నెలకొన్న ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డును అధిగమించకపోయినా.. 2025 అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచినట్లు వెల్లడించింది. చరిత్రలో తొలిసారిగా మూడేళ్ల సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు దాటింది. వేసవిలో వేడి, శీతకాలంలో చలి తీవ్రత అధికమైనట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 1995-2024 మధ్యలో 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు ఇటీవల జర్మన్‌వాచ్‌సంస్థ విడుదల చేసిన ‘క్లైమేట్‌రిస్క్‌ ఇండెక్స్‌-2026’ పేర్కొంది. వాటి వల్ల ప్రత్యక్షంగా 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 

Current Affairs

అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం

అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 27న ‘అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం’గా (International Day Of Epidemic Preparedness) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల నివారణ, సంసిద్ధత, సహకారాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, ఒక సమాజంలో లేదా ప్రాంతంలో అనారోగ్య సంఘటనలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడాన్ని అంటువ్యాధిగా పేర్కొంటారు. ఇవి ఒక నిర్దిష్ట కాలపరిమితిలో సంభవిస్తాయి. రుగ్మత కారకం, దీనికి గురైన జనాభా పరిమాణం, రకం, గతంలో ఆ వ్యాధికి గురికావడం, ప్రదేశం లాంటి అనేక కారకాలు అంటువ్యాధుల ఉనికిని సూచించే కేసుల సంఖ్యను ప్రభావితం చేస్తాయి.  చారిత్రక నేపథ్యం అంటువ్యాధులకు సంసిద్ధత, నివారణ, వాటికి వ్యతిరేకంగా ప్రజలు - ప్రభుత్వాలు - దేశాల భాగస్వామ్యానికి ఉన్న ప్రాముఖ్యతను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి, అంటువ్యాధుల నిర్వహణపై అవగాహన కోసం ఒక రోజును ఏర్పాటు చేయాలని భావించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబరు 27న ‘అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం’గా జరుపుకోవాలని 2020లో తీర్మానించింది. నాటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

Current Affairs

క్రిస్టియన్‌ ఎయిడ్‌ నివేదిక

2025లో వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు, కరవు, తుపానులు మొదలైన వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని రష్యాకు చెందిన క్రిస్టియన్‌ ఎయిడ్‌ నివేదిక వెల్లడించింది. ఈ విపత్తులు సహజమైనవి కావని, శిలాజ ఇంధనాల వినియోగం, రాజకీయ నిర్లక్ష్యం కారణంగా ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది.  అమెరికాలో కాలిఫోర్నియా కార్చిచ్చులు అత్యధికంగా రూ.5 లక్షల కోట్ల (సుమారుగా) నష్టం కలిగించాయని వెల్లడించింది. ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, ఇండోనేసియా, శ్రీలంక, వియత్నాం, మలేసియాల్లో సంభవించిన తుపానుల కారణంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది.

Current Affairs

మలేసియాలో సంస్కృత శాసనాలు

మలేసియాలోని బుకిట్‌ కోరస్‌లో పురాతన సంస్కృత శాసనాలు లభ్యమయ్యాయి. అక్కడ తవ్వకాలు జరపగా బుద్ధుడి విగ్రహంతోపాటు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మూడు రాళ్లు దొరికాయి. వాటిపై సంస్కృత శాసనాలున్నాయి. అవి 8, 9 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్నారు. బుకిట్‌ కోరస్‌ అనేది ఒకప్పటి మహాయాన బౌద్ధ పవిత్ర క్షేత్రం. గతంలో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 8వ శతాబ్దంనాటి పల్లవ కాలంనాటి శాసనాలు లభించాయి. 

Current Affairs

వినియోగదారులకు వరంగా మారిన 1915

2025లో దేశవ్యాప్తంగా వినియోగదార్లకు మొత్తం మీద రూ.45 కోట్ల రిఫండ్‌లను రికవరీ చేయడంలో జాతీయ వినియోగదార్ల హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) సాయం చేసింది. 67,265 వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఇ-కామర్స్‌ రంగంపై అత్యధికంగా సుమారుగా 40,000 ఫిర్యాదులు రాగా, వాటిని పరిష్కరించి రూ.32 కోట్లను రికవరీ చేసింది. ఇది మొత్తం చెల్లింపుల్లో మూడింట రెండు వంతుల కంటే అధికం. తర్వాతి స్థానంలో ప్రయాణ, పర్యాటక రంగం (రూ.3.5 కోట్లు) ఉంది.  వినియోగదార్లు తమ ఫిర్యాదులను టోల్‌-ఫ్రీ-నంబరు (1915), వాట్సప్‌ (8800001915), ఎస్‌ఎంఎస్, ఇమెయిల్, వెబ్‌ పోర్టల్‌ ద్వారా 17 భాషల్లో నమోదు చేసే సదుపాయం ఉంది. 

Current Affairs

భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలు జయశ్రీ

భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సీఈఓల్లో జయశ్రీ ఉల్లాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. ‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2025’ ప్రకారం, అరిస్టా నెట్‌వర్క్స్‌ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌ రూ.50,170 కోట్ల నికర సంపదతో సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ అయిన అరిస్టా నెట్‌వర్క్స్‌లో 2008 నుంచి ఆమె సేవలు అందిస్తున్నారు. ఫోర్బ్స్‌ ప్రకారం.. ఆమె నాయకత్వంలో 2024లో కంపెనీ 7 బిలియన్‌ డాలర్ల (రూ.63,000 కోట్ల) ఆదాయాన్ని నమోదు చేసింది. 2023తో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అరిస్టా నెట్‌వర్క్స్‌లో ఆమెకు సుమారు 3 శాతం వాటా ఉంది. జయశ్రీ ఉల్లాల్‌ 1961 మార్చి 27న లండన్‌లో భారత సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారు. 2025లో ఇంజినీరింగ్‌లో గౌరవ డాక్టరేట్‌ పొందారు.

Current Affairs

పెరగనున్న సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం

మనదేశంలో మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 356 గిగావాట్లు కాగా, 2025 నాటికి అది దాదాపు 475 గిగావాట్లకు విస్తరించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పాటు కావడం దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 81 గిగావాట్లు మాత్రమే. కానీ 2030 నాటికి అయిదురెట్లకు పైగా వృద్ధి చెంది 430 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ విభాగాల్లో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పాటయ్యే అవకాశం కలుగుతోంది. 

Current Affairs

ప్రపంచంలోకెల్లా అతిసూక్ష్మ, స్వతంత్ర రోబోల సృష్టి

ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మ పరిమాణంలోని స్వతంత్ర రోబో ఆవిష్కృతమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్‌ యూనివర్సిటీల పరిశోధకులు దీన్ని సృష్టించారు. ఇవి 200×300×50 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. కాంతి ద్వారా శక్తిని పొందే ఈ చిట్టి రోబోలు స్థానిక ఉష్ణోగ్రతలను పసిగట్టి ముందుకు కదులుతాయి. కణాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సామర్థ్యం వీటి సొంతం. అతిచిన్న సాధనాలను రూపొందించడంలో ఇవి కీలకంగా మారనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Current Affairs

కోల్‌ ఇండియా సీఈఓగా సాయిరాం

ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్న బి.సాయిరాంను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025, డిసెంబరు 26న ఆమోదం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో కోల్‌ ఇండియాకు 80% వాటా ఉంది.