ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
దేశాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక భూమిక పోషిస్తుంది. ప్రపంచ అవగాహనను పెంపొందించడంలో, ఉద్యోగ - ఉపాధి కల్పనలో, సమ్మిళిత వృద్ధిని సాధించడంలో ఇది చాలా ముఖ్యం. సేవా రంగంలో ప్రధాన విభాగమైన పర్యాటకం అనేది ఆయా దేశాల్లో ఉండే విభిన్న సంస్కృతులు, ప్రజలు, వారసత్వం, కళలు, వంటలు, ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణ మార్పు, ఆర్థిక మాంద్యం, మహమ్మారి (pandemics) పరిస్థితులు టూరిజానికి పెద్ద సవాళ్లు. వీటన్నింటినీ అధిగమించి పర్యాటక రంగం బలం, అనుకూలతలను చాటే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 17న ‘ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం’గా (Global Tourism Resilience Day) నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక మార్పిడి, పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించగల టూరిజం రంగంపై అందరికీ అవగాహన కల్పించడంతోపాటు భవిష్యత్తులో వచ్చే అంతరాయాలను ఎదుర్కొనేలా వ్యూహాలు రచించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం ప్రపంచంలోని అనేక స్వల్ప, మధ్య ఆదాయ దేశాలకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. స్థిరమైన, సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే స్థితిస్థాపక పర్యాటకం అవసరం. అప్పుడే దేశీయ వనరుల సమీకరణ, పర్యావరణ పరిరక్షణ, పేదరికం - ఆకలి నిర్మూళన, జీవవైవిధ్యం, సహజ వనరుల రక్షణ, స్థిర వినియోగం లాంటివి సాధ్యమవుతాయి. ఈ కారణంగానే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏటా ఫిబ్రవరి 17న ‘ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం’గా జరుపుకోవాలని 2022, డిసెంబరు 22న ప్రకటించింది. 2023 నుంచి ప్రతి సవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 2026 నినాదం: Tourism Resilience in Action: From Crisis Response to Impactful Transformation