కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను 2026, ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్ను సమర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి. మొత్తం బడ్జెట్ రూ. 53,47,315 కోట్లు. రెవెన్యూ వసూళ్లు: రూ.35,33,150 కోట్లు; రెవెన్యూ వ్యయం: రూ.41,25,494 కోట్లు; మూలధన వసూళ్లు: రూ.18,14,165 కోట్లు; మూలధన వ్యయం: రూ.12,21,821 కోట్లు.
చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్
వరసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్టును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వేర్వేరు పదవీకాలాల్లో పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువయ్యారు. 1959-64 మధ్య ఆరుసార్లు, 1967-69 మధ్య నాలుగుసార్లు మొరార్జీకి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. కేంద్ర మాజీ మంత్రుల్లో పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు వేర్వేరు ప్రభుత్వాల్లో బడ్జెట్లు సమర్పించారు. అందువల్ల వరసగా తొమ్మిదేళ్లు, అదీ ఒకే ప్రధాని (నరేంద్రమోదీ) హయాంలో కేంద్ర పద్దు సమర్పించిన ఘనత మాత్రం నిర్మలదే అవుతుంది.
బడ్జెట్లో రంగాలవారీ కేటాయింపులు - ముఖ్య విశేషాలు
వ్యవసాయ రంగం:
2026-27 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇది 2025-26 సంవత్సరానికి సవరించిన అంచనాల మొత్తమైన రూ.1,51,853 కోట్ల కంటే 7.12% ఎక్కువ. ఉత్పాదకత పెంపు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి లక్షిత ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. ఆమె చెప్పిన ప్రకారం..
ఆకాంక్షిత జిల్లాల స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి ‘ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన’ను చేపట్టనున్నారు. తక్కువ దిగుబడులు వస్తున్న 100 జిల్లాల్లో ఇప్పుడున్న పథకాలను, ప్రత్యేక చర్యల్ని కలిపి దీనిని అమలు చేస్తారు.
దేశీయంగా మత్స్య పరిశ్రమకు ఊతమివ్వడానికి 500 జలాశయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. అమృత్ సరోవర్లను తీర్చిదిద్దుతారు.
రక్షణ రంగం..
2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7,84,678 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయింపుల (రూ.6.81 లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఈ దఫా ప్రధానంగా ఆధునికీకరణకు పెద్దపీట వేశారు. ప్రభుత్వం 2026-27లో చేయదలిచిన వ్యయంలో రక్షణ వాటా 14.67 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖలన్నింటిలోకీ ఇదే అత్యధికం. మొత్తంమీద గత 26 ఏళ్లలో రక్షణ బడ్జెట్ 40 శాతం పెరిగింది.
బయోఫార్మా శక్తి..
దేశాన్ని బయోఫార్మా హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. దీని కింద ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 1,000 క్లినికల్ ట్రయల్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్ఓ)ను పటిష్ఠపరుస్తారు.
హోంశాఖ..
2026-27 కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు రూ.2.55 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఈ శాఖకు 2025-26లో కేటాయించిన రూ.2.33 లక్షల కోట్లతో పోలిస్తే 9.44 శాతం అధికం.
హోంశాఖకు చేసిన కేటాయింపుల్లో ‘పోలీసు’ పద్దు కింద రూ.1.73 లక్షల కోట్లను ప్రత్యేకించారు. మొత్తం హోంశాఖ బడ్జెట్లో ఇది 68 శాతం.
అంతరిక్ష విభాగానికి..
అంతరిక్ష విభాగానికి ఈ దఫా రూ.13,705.60 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.13,416 కోట్లతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదలే. అయితే 2025-26కు సంబంధించిన సవరించిన అంచనాల ప్రకారం అంతరిక్ష విభాగానికి వాస్తవానికి రూ.12,448.60 కోట్లే అందాయి.
తాజా బడ్జెట్లో ‘అంతరిక్ష పరిజ్ఞాన’ పద్దు కింద రూ.10,397.06 కోట్లను కేటాయించారు. దీనికింద ఇస్రోలోని వివిధ కేంద్రాలకు, వాహకనౌక, ఉపగ్రహ ప్రాజెక్టులకు నిధులు అందుతాయి.
నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ
నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖకు 2026-27 సంవత్సరానికి రూ.9,885.80 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది బడ్జెట్ అంచనాల కన్నా 62 శాతం ఎక్కువ. ఈ నిధుల్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన ‘పీఎం సేతు’కు రూ.6,140.50 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధికి రూ.6,100 కోట్లు కేటాయించగా తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2,703.54 కోట్లకు చేరింది.