Posts

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత క్రీడాకారిణి సోనమ్‌ మస్కర్‌ రజత పతకం సాధించింది. 2024, అక్టోబరు 15న దిల్లీలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో సోనమ్‌ (252.9) ద్వితీయ స్థానంలో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ రన్నరప్‌ హువాంగ్‌ యుటింగ్‌ (254.5- చైనా) పసిడి నెగ్గింది. ఎనిమిది మంది బరిలో దిగిన ఫైనల్లో మరో భారత క్రీడాకారిణి తిలోత్తమ సేన్‌ ఆరో స్థానంలో నిలిచింది. 

Current Affairs

డబ్ల్యూటీఎస్‌ఏ - 2024

నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్‌ టెలికమ్యూనికేషన్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్‌ఏ)-2024ను దిల్లీలోని భారత్‌ మండప్‌లో ప్రధాని మోదీ 2024, అక్టోబరు 15న ప్రారంభించారు. దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎమ్‌సీ) 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. టెలికాం, సంబంధిత సాంకేతికత విషయంలో ముందుకెళుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ఇక్కడ 120 కోట్ల మంది మొబైల్‌ వినియోగదార్లు, 95 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదార్లున్నారు. మొత్తం ప్రపంచంలో 40 శాతానికి పైగా డిజిటల్‌ లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నాయి అని మోదీ పేర్కొన్నారు.

Current Affairs

ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం

అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ఎంక్యూ-9బీ ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై భారత్‌ 2024, అక్టోబరు 15న సంతకం చేసింది. దీని కింద అమెరికా ఆయుధ దిగ్గజం ‘జనరల్‌ అటామిక్స్‌’ నుంచి మన దేశం మొత్తం 31 డ్రోన్లను కొనుగోలు చేస్తుంది. ఇందుకు సుమారు 400 కోట్ల డాలర్లు (రూ.33,600 కోట్ల)ను వెచ్చించనుంది.  డ్రోన్ల మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి కూడా రక్షణ శాఖకు, జనరల్‌ అటామిక్స్‌కు మధ్య విడిగా ఒక ఒప్పందం కుదిరింది. 

Current Affairs

ఎఫ్‌టీ ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ర్యాంకింగ్, 2024

ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ర్యాంకింగ్, 2024లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ప్రపంచ స్థాయిలో 40వ ర్యాంకు సాధించింది. ఈసారి మనదేశం నుంచి ఈ జాబితాలో చోటు లభించిన విద్యా సంస్థ ఐఎస్‌బీ ఒక్కటే.   ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రాంలో చేరాలనుకునే వారికి 10 సంవత్సరాలకు పైగా వ్యాపార అనుభవం, వ్యాపార సంస్థల యజమానులు కావడం, పేరున్న వ్యాపార సంస్థల్లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయడం లేదా వృత్తి నిపుణులు అయి ఉండాలి. 

Current Affairs

గురుడి చందమామ యూరోపా శోధనకు వ్యోమనౌక

గురుగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న యూరోపా అనే చందమామపై జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా 2024, అక్టోబరు 14న ఒక వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. యూరోపా క్లిపర్‌ అనే వ్యోమనౌక 300 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి గురు గ్రహాన్ని చేరుతుంది. ఇందుకు ఐదున్నరేళ్లు పడుతుంది.  గురుగ్రహ కక్ష్యలోకి చేరాక యూరోపా క్లిపర్‌ 49 సార్లు యూరోపాకు చేరువగా వచ్చి వెళుతుంది. హిమమయంగా ఉండే ఈ చందమామ ఉపరితలం కింద భారీ సముద్రం ఉండొచ్చని, అక్కడి నీటిలో జీవుల మనుగడకు అవసరమైన వాతావరణం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. యూరోపా క్లిపర్‌ బరువు 5,700 కిలోలు. ఈ ప్రాజెక్టు వ్యయం 520 కోట్ల డాలర్లు. 

Current Affairs

నిమా రింజి షెర్పా

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 14 పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నేపాల్‌కు చెందిన నిమా రింజి షెర్పా (18) రికార్డు సృష్టించారు. ఇటీవల ఈయన చైనాలోని 8,027 మీటర్ల (26,335 అడుగుల) ఎత్తైన షిషపంగ్మా పర్వతాన్ని అధిరోహించాడు. గతంలో 30 ఏళ్ల వయసున్న ఓ షెర్పా ఈ ఘనత సాధించారు.

Current Affairs

ఐఏఎఫ్‌ వరల్డ్‌ స్పేస్‌ పురస్కారం

చంద్రుడిపై పరిశోధనల్లో గణనీయ పురోగతి సాధించిన చంద్రయాన్‌-3 మిషన్‌కు నేతృత్వం వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిపతి, డీవోఎస్‌ సెక్రటరీ డాక్టర్‌ సోమనాథ్‌కు ప్రతిష్ఠాత్మక ఐఏఎఫ్‌ వరల్డ్‌ స్పేస్‌ పురస్కారం దక్కింది. ఇటలీలోని మిలాన్‌లో 2024, అక్టోబరు 14న జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ఐఏఎఫ్‌ ప్రతినిధుల చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.

Current Affairs

నోబెల్‌ పురస్కారం 2024 - ఆర్థికశాస్త్రం

దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం 2024 లభించింది. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన డారెన్‌ అసెమోగ్లు, సైమన్‌ జాన్సన్‌లతో పాటు షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్‌ రాబిన్సన్‌లను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు 2024, అక్టోబరు 14న ‘రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ ప్రకటించింది. కొన్ని దేశాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి..? కొన్ని దేశాలు ఎందుకు ఎప్పుడూ పేదరికంలో మగ్గుతున్నాయి..? అన్న అంశంపై వీరు చేసిన పరిశోధనకు ఈ అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 

Current Affairs

స్టార్‌షిప్‌ రాకెట్‌

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ ఇటీవల ప్రయోగించిన భారీ స్టార్‌షిప్‌ రాకెట్‌ బూస్టర్‌ నింగిలోకి దూసుకెళ్లి, ఆ తర్వాత లాంచ్‌ప్యాడ్‌ (లాంచ్‌టవర్‌)కే సురక్షితంగా చేరుకుంది. ప్రస్తుత ప్రయోగంలో భాగంగా- టెక్సాస్‌లో మెక్సికో సరిహద్దుకు సమీపం నుంచి 2024, అక్టోబరు 13న రెండు దశల (బూస్టర్, వ్యోమనౌక) స్టార్‌షిప్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దాని పొడవు 121 మీటర్లు. అందులోని బూస్టర్‌ పొడవు 71 మీటర్లు. నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత బూస్టర్‌ కిందకు దిగుతూ లాంచ్‌టవర్‌కు తిరిగొచ్చింది. చాప్‌స్టిక్స్‌లా పనిచేసే తన భారీ మరహస్తాలతో లాంచ్‌టవర్‌ దాన్ని పదిలంగా ఒడిసిపట్టి చరిత్ర సృష్టించింది. మరోవైపు- స్టార్‌షిప్‌ రాకెట్‌తో నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక తన ప్రయాణాన్ని కొనసాగించి, హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. 

Current Affairs

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌లో మహిళల డబుల్స్‌లో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ జంట కంచు పతకం సొంతం చేసుకుంది. 2024, అక్టోబరు 13న ఆస్తానా (కజకిస్థాన్‌)లో జరిగిన సెమీఫైనల్లో ఐహిక-సుతీర్థ ద్వయం 4-11, 9-11, 8-11తో మివా హరిమోటో-మియూ కిహారా (జపాన్‌) జోడీ చేతిలో ఓడింది. ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చరిత్రలో మహిళల డబుల్స్‌లో భారత్‌కు దక్కిన తొలి పతకమిదే.  1972లో ఈ టోర్నీ మొదలయ్యాక మహిళల డబుల్స్, టీమ్‌ విభాగాల్లో పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి.