కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక సాధికారత. దేశాభివృద్ధిలో ఇది కీలక భూమిక పోషిస్తుంది. ఒకప్పుడు సమాజంలో అంటరానితనం, సామాజిక వివక్ష లాంటి రుగ్మతలు ఉండేవి. వాటిని రూపుమాపేందుకు బలంగా పోరాడిన వ్యక్తుల్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఒకరు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన ప్రారంభించిన ‘మహద్ సత్యాగ్రహానికి’ గుర్తుగా ఏటా మార్చి 20న ‘సామాజిక సాధికారత స్మారక దినోత్సవం’గా నిర్వహిస్తారు. దీన్నే ‘సామాజిక సాధికారత దినోత్సవం’ అనే పేరుతోనూ పిలుస్తారు. అణగారిన వర్గాల హక్కులను తెలియజేయడంతోపాటు వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
అణగారిన వర్గాల హక్కుల కల్పనకు, వారిలో పోరాట స్ఫూర్తిని రేకెత్తించడానికి మహద్ సత్యాగ్రహం ఎంతగానో తోడ్పడింది. దళితులు చౌదర్ చెరువు నీటిని వాడుకోవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించాక 1940, మార్చి 19న అంబేడ్కర్ మహద్లో ర్యాలీ నిర్వహించారు. మహద్ సత్యాగ్రహానికి గుర్తుగా ఏటా మార్చి 20న ‘సాధికారత దినోత్సవం’గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నాటి నుంచి ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తున్నారు.