తెలంగాణలో విద్యలో వివిధ సామాజికవర్గాల మధ్య అంతరాలు తీవ్రంగా ఉన్నాయని సమగ్ర కుటుంబ సర్వే అధ్యయన నివేదిక పేర్కొంది. జనరల్ కేటగిరీ కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఎస్టీ మహిళల్లో అత్యధికంగా 83 శాతం మంది పదో తరగతికి మించి చదువుకోలేదు. అదే ఓసీ బ్రాహ్మణ వర్గంలో ఈ శాతం 36.2 మాత్రమే. సర్వేలో పాల్గొన్నవారిలో 14 లక్షల మంది తమకు కులం లేదని చెప్పారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి తదితర అంశాలపై సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం 2024 ఆఖర్లో నిర్వహించింది. బలహీనవర్గాలకు వివిధ పథకాల అమలు, ఉపాధి, రాజకీయ అవకాశాలు లభించేలా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సర్వే దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
57 కీలక ప్రశ్నలు, మరికొన్ని అనుబంధ ప్రశ్నలు కలిపి 75 అంశాలపై 1,12,36,489 కుటుంబాల (97.1 శాతం) వివరాలు సేకరించింది.