ఆయుధ దిగుమతుల్లో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తాజా నివేదిక పేర్కొంది. 2021-25 కాలానికి సంబంధించిన వివరాలను ఈ సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచింది. సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఖతార్ (4), పాకిస్థాన్ (5) నిలిచాయి. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు భారీగా పెరిగాయి.
ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 8.2 శాతంగా ఉంది. అయితే అంతకుముందు అయిదేళ్లతో పోలిస్తే.. 2021-25 కాలంలో భారత విదేశీ ఆయుధ కొనుగోళ్లు 4 శాతం మేర తగ్గాయి.
భారత ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 40శాతంగా ఉంది. 2016-20 కాలంలో అది 51 శాతంగా ఉండేది. భారత్ క్రమంగా ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాల వైపు మళ్లడమే ఈ తగ్గుదలకు కారణం. 2011-15 మధ్యకాలంలో భారత్ దిగుమతి చేసుకున్న అస్త్రశస్త్రాల్లో రష్యా వాటా 70 శాతంగా ఉండేది.