తెలంగాణ శాసనసభలో వివిధ రంగాలపై 2021-25 మధ్య కాలానికి సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలను 2026, మార్చి 30న ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరుకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదికను, 2022-23లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, 2024-25లో రాష్ట్ర బడ్జెట్ ఆదాయ, వ్యయాల ఆడిట్ నివేదికలను వేర్వేరుగా శాసనసభలో ప్రవేశపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సేకరిస్తున్న అప్పుల సొమ్ములో అభివృద్ధి పనులకు (మూలధన) వ్యయం పెరగకపోగా తగ్గినట్లు కాగ్ స్పష్టం చేసింది. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు రూ.56,968 కోట్లు కాగా అందులో మూలధన వ్యయం రూ.36,072 కోట్లుగా ఉన్నట్లు ఆడిట్లో తేలింది. అంతకుముందు ఏడాది (2023-24)లో అప్పులు రూ.50,528 కోట్లు కాగా... మూలధన వ్యయం కింద రూ.43,918 కోట్లు ఖర్చుపెట్టారు. 2024-25 రుణాలు పెరిగినా.. మూలధన వ్యయం తగ్గిపోయినట్లు కాగ్ వివరించింది. గత ఏడాది తీసుకున్న రుణాలను 7.07 నుంచి 7.48 శాతం వార్షిక వడ్డీలతో 2035 నుంచి 2055 సంవత్సరాల మధ్య చెల్లించాలి.