2024-25 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ తెలిపింది.
బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటల దిగుబడి సైతం అంతకుముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు వివరించింది.
తాజా నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ శాఖ అందజేసింది.
ముఖ్యాంశాలు:
2023-24లో 168.75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ 2024-25 దాన్ని అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించింది.
తెలంగాణ తర్వాత వరుసగా ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఉన్నాయి.
రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి వేయడంతో దిగుబడులు వెల్లువెత్తాయి.
ఉదాహరణకు గత రబీ(యాసంగి) సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 16 లక్షల హెక్టార్లు కాగా... 2024లో ఏకంగా 24.04 లక్షల హెక్టార్లలో సాగయింది.
గతేడాది ఖరీఫ్(వానాకాలం), రబీ(యాసంగి)లో కలిపి మొత్తం 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది.
దీని నుంచి 183 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తయినట్లు నివేదిక తెలిపింది.