భారత సర్వసైన్యాధికారైన రాష్ట్రపతికి ఎయిడ్-డె-క్యాంప్ (ఏడీసీ)గా నియమితులైన మొదటి మహిళా నేవల్ ఆఫీసర్గా నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వీ సోలంకి గుర్తింపు పొందారు. భారత ప్రథమ పౌరులైన రాష్ట్రపతికీ, వివిధ ప్రభుత్వ విభాగాలకూ మధ్య సమన్వయకర్తగా ఉంటూ అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, మిలిటరీ ప్రోటోకాల్స్ సవ్యంగా సాగేలా చూడటం ఏడీసీ విధి. రాష్ట్రపతికి మొత్తం అయిదుగురు ఏడీసీలు ఉంటారు. ఆర్మీ నుంచి ముగ్గుర్నీ, ఎయిర్ఫోర్స్, నేవీల నుంచి చెరొకరినీ ఎంపికచేస్తారు. వీళ్లలోంచి ఒకరిని రాష్ట్రపతి విధుల కోసం ఎంచుకుంటారు. సర్వీసులో కనీసం 5-7 ఏళ్లపాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవాళ్లనే ఏడీసీగా నియమిస్తారు.