రక్షణ రంగంలోని వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2025 సంవత్సరానికి మొదటి విడత నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 1 జనవరి 2026 నుంచి ప్రారంభమయ్యే 155వ కోర్సులో, 117వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 406
వివరాలు:
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1)-2025
ఖాళీలు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 36 ఉన్నాయి.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయోపరిమితి: అభ్యర్థులు 2 జులై, 2006కి ముందు, 1 జులై, 2009కి తర్వాత పుట్టి ఉండకూడదు.
దరఖాస్తు: దరఖాస్తులను ఆన్లైన్లో పంపాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఏదైనా కారణాల వల్ల దరఖాస్తు ఉపసంహరించుకోవానుకుంటే చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్)లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు (సమయం రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి(సమయం రెండున్నర గంటలు). రుణాత్మక మార్కులుంటాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు.
శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను దేహ్రాదూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.
దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండ (వరంగల్ అర్బన్).
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-12-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 01-01-2025 నుంచి 07-01-2025 వరకు.
పరీక్ష తేదీ: 13-04-2025.
కోర్సు ప్రారంభం: 01-01-2026.
Website:https://upsc.gov.in/
Apply online:https://upsconline.nic.in/upsc/OTRP/