ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ‘ప్రపంచంలో బాలల స్థితిగతులు-2025’ పేరిట ఓ నివేదికను యునిసెఫ్ 2025, నవంబరు 20న విడుదల చేసింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్ కృషి చేస్తున్నప్పటికీ, దేశంలో చాలామంది చిన్నారులు కనీస సేవలను అందుకోవడంలో ఇంకా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ పేర్కొంది.
భారత్లో ఉన్న పిల్లల్లో దాదాపు సగం మంది (20.6 కోట్లు) విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, రక్షిత నీరు, పారిశుద్ధ్యం లాంటి ఆరు తప్పనిసరి సేవల్లో కనీసం ఒక దాన్ని పొందలేకపోతున్నారని అందులో పేర్కొంది. ఇందులో మూడోవంతు (6.2 కోట్లు) కన్నా తక్కువ మంది పిల్లలు రెండు లేదా అంత కంటే ఎక్కువ కనీస సౌకర్యాలకు నోచుకోకపోతున్నారని వెల్లడించింది. చిన్నారులు వీటి నుంచి బయటపడటానికి సహకారం అవసరమని సూచించింది.