ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదికను 2024, అక్టోబరు 24న విడుదల చేసింది. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది.
పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ఇప్పటికే భూతాపం 1.3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగినట్లు తెలిపింది. ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలో కొనసాగితే.. ఈ శతాబ్దాంతానికి భూతాపం మరో 1.8 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే ముప్పుందని హెచ్చరించింది.
పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్న హామీలను అన్ని దేశాలూ పక్కాగా నెరవేరిస్తే ఈ పెరుగుదలలో 0.5 డిగ్రీల మేర కోత పెట్టొచ్చని పేర్కొంది. అయినప్పటికీ వడగాలులు, కార్చిచ్చులు, తుపానులు, కరవుల వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను తగ్గించడం కష్టమేనని అభిప్రాయపడింది.