ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రజాస్వామ్య విధానంలోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. స్వేచ్ఛ, మానవ హక్కులకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి మహోన్నత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచిన ‘మాగ్నా కార్టా’ ప్రకటనకు గుర్తుగా ఏటా జూన్ 15న ‘మాగ్నా కార్టా డే’గా నిర్వహిస్తారు.
చారిత్రక నేపథ్యం:
ఇంగ్లండ్ రాజైన కింగ్ జాన్ ఎడ్వర్డ్ (1167-1216) పాలనలో ప్రజలు అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారు.
ఈయన జనాల నుంచి అధిక పన్నులు వసూలు చేయడంతోపాటు వారిని కఠినంగా శిక్షించేవాడు.
చర్చిలపై ప్రభుత్వ జోక్యం అధికంగా ఉండేది. ఇతడి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఇంగ్లిష్ బారన్లు (సామంతులు), చర్చి నాయకులు రహస్యంగా సమావేశమై రాజు అధికారాన్ని పరిమితం చేయాలని ‘మాగ్నా కార్టా’ అనే పత్రాన్ని రూపొందించారు.
రాజుతో సహా ప్రజలందరూ చట్టానికి లోబడే ఉంటారనే సూత్రాన్ని ఇందులో ప్రతిపాదించారు.
అలాగే ప్రజలకు వివిధ హక్కులు కల్పించి, వారి రక్షణ కోసం ప్రత్యేక నియమాలు రూపొందించారు.
మొదట జాన్ ఎడ్వర్డ్ దీన్ని ఆమోదించలేదు.
అయితే ప్రజల్లో ఇతడిపై వ్యతిరేకత ఎక్కువవడంతో దానికి తలొగ్గి 1215, జూన్ 15న మాగ్నా కార్టాపై సంతకం చేశాడు.