గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఇదే మండలం అనంతవరప్పాడుకు చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు బండారు శ్రీనివాసరావు ‘ఫెలో ఫార్మర్’ పురస్కారాలను అందుకున్నారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ దిల్లీలో 2026, ఫిబ్రవరి 25న నిర్వహించిన ‘పూసా కృషి విజ్ఞాన్ మేళా 2026’లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీరికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
చిరుధాన్యాల నుంచి ఉప ఉత్పత్తుల తయారీ, విలువ జోడింపు, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించడం, ప్రకృతి విధానంలో సాగు తదితర అంశాల్లో చేస్తున్న కృషికిగాను వెంకటేశ్వరరావుకు ఈ అవార్డు లభించింది. అధునాతన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో పంటల సాగుకు గాను బండారు శ్రీనివాసరావుకు పురస్కారం వరించింది.