Published on Aug 31, 2024
Current Affairs
పారాలింపిక్స్‌లో భారత్‌కు 4 పతకాలు
పారాలింపిక్స్‌లో భారత్‌కు 4 పతకాలు

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు 2024, ఆగస్టు 30న స్వర్ణం సహా నాలుగు పతకాలు సాధించారు. అవని లేఖరా స్వర్ణం, మనీశ్‌ నర్వాల్‌ రజతం, మోనా, ప్రీతి పల్‌ కాంస్యం నెగ్గారు.

అవని లేఖరా

* అవని 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో తన పేరిటే ఉన్న పారాలింపిక్స్‌ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. ఆమె 249.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మూడేళ్ల కిందట టోక్యోలో ఆమె 249.6 పాయింట్లతో రికార్డు పసిడి గెలిచింది.  పారాలింపిక్స్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 

మోనా అగర్వాల్‌

* మోనా అగర్వాల్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో 228.7 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా షూటర్‌ లీ యున్రి 246.8 పాయింట్లతో రజతం సాధించింది.

మనీశ్‌ నర్వాల్‌ 

* 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనీశ్‌ రజతం గెలిచాడు. ఫైనల్లో అతడు 234.9 పాయింట్లతో రెండో స్థానం సాధించాడు. కొరియా షూటర్‌ జియాంగ్‌డు 237.4 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. చైనాకు చెందిన యాంగ్‌ చావ్‌ 214.3 పాయింట్లతో కాంస్యం గెలిచాడు. 

* పారాలింపిక్స్‌లో మనీశ్‌కి ఇది రెండో పతకం. టోక్యోలో 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో అతడు స్వర్ణం సాధించాడు.

ప్రీతి పాల్‌

* పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అథ్లెటిక్స్‌లో వచ్చింది. మహిళల టీ-35 100 మీటర్ల పరుగులో 23 ఏళ్ల ప్రీతి పాల్‌ కాంస్యం గెలిచింది. ఆమె 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. చైనా అథ్లెట్లు జౌ జియా (13.58 సె), గువా కియాంక్వియాన్‌ (13.74 సె) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు.

ఆర్తికి కాంస్యం
అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ ఆర్తి కాంస్యం సొంతం చేసుకుంది. 2024, ఆగస్టు 30న లిమా (పెరూ)లో జరిగిన 10 వేల మీటర్ల రేస్‌వాక్‌లో ఆమె ఆర్తి 44 నిమిషాల 39.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది.