ఏ దేశ సమాజంలోనైనా వ్యక్తులు, అన్ని వర్గాల మధ్య సమానత్వం కనిపించదు. పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు లాంటి అనేక అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి సాంఘిక ప్రగతి సాధించాలంటే సామాజిక న్యాయం అవసరం. సర్వజన సమానత్వం, మానవ హక్కుల రక్షణ, పేదరిక నిర్మూలన ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. సామాజిక, ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పౌరులందరికీ సమాన అవకాశాలు, వనరులు అందాలనే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 20న ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం’గా (World Day of Social Justice) నిర్వహిస్తారు. సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సమానత్వాన్ని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ఐక్యరాజ్య సమితి (ఐరాస) 1995 మార్చి 6-12 తేదీల్లో డెన్మార్క్లోని కోపెన్హగన్లో సామాజిక అభివృద్ధి సదస్సను నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన వందకు పైగా నాయకులు ఇందులో పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ ఉపాధి, స్థిరమైన - న్యాయపరమైన - సురక్షితమైన సమాజాలను సృష్టించడానికి చర్యలు తీసుకోవాలని అందులో తీర్మానించారు. ఈ సదస్సు ఫలితంగా కోపెన్హగన్ ప్రకటన, కార్యాచరణ కార్యక్రమం రూపుదిద్దుకున్నాయి.
సమ సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 20న ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరపాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2007లో అధికారికంగా ప్రకటించింది. 2009 నుంచి ఏటా దీన్ని నిర్వహించాలని తీర్మానించింది.