వివిధ ఉత్పత్తులు, వస్తువులు, సేవలు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి వాటి నాణ్యత, స్వచ్ఛత, ప్రమాణాల గురించి సమాచారం పొందే హక్కు ఉంటుంది. దీన్నే వినియోగదారుల హక్కు అంటారు. చాలా మందికి దీనిపై అవగాహన లేక నకిలీ వస్తు, సేవల వల్ల మోసపోవడమో లేదా అన్యాయానికి గురవడమో జరుగుతోంది. అన్యాయమైన పద్ధతులు, వివక్ష, దోపిడీకి గురికాకుండా వినియోగదారులను రక్షించే లక్ష్యంతో ఏటా మార్చి 15న ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’గా నిర్వహిస్తారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంతోపాటు వారి రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
1962, మార్చి 15న నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ యూఎస్ కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల సమస్యలపై కీలక ప్రసంగం చేశారు. ఈ స్ఫూర్తితో మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని 1983లో నిర్వహించారు. అప్పటి నుంచి కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని అధికారికంగా జరుపుతోంది.