సముద్ర వనరుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఏటా జూన్ 8న ‘ప్రపంచ మహాసముద్ర దినోత్సవం’గా నిర్వహిస్తారు.
భూగోళంపై అతి ముఖ్యమైన సహజ వనరుల్లో మహాసముద్రాలు ఒకటి.
ఇవి అనేక కోట్ల జలచరాలకు ఆవాసాలుగా ఉండి, జీవవైవిధ్యాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి.
సముద్రాల్లోని ఆల్గే, ప్లవకాల ద్వారా 25% ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదలవుతుంది.
మానవులకు 17% ఆహార ఉత్పత్తులు ఈ వనరుల నుంచే లభిస్తున్నాయి.
అయితే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందిన కొద్దీ మహాసముద్రాలు కూడా అంతే స్థాయిలో కాలుష్యాల బారిన పడుతున్నాయి.
ఈ ప్రభావం సముద్ర జీవులతోపాటు, మానవాళిపైనా అధికంగానే ఉంటోంది.
అందుకే మహాసముద్రాల పరిరక్షణ, దాని కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
బ్రెజిల్లోని రియో డి జెనిరోలో 1992, జూన్ 3 నుంచి 14 వరకు ఎర్త్ సమ్మిట్ జరిగింది.
అందులో జూన్ 8న కెనడాకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్మెంట్ (ఐసీఓడీ) ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది.
సముద్రాల ప్రాముఖ్యతతోపాటు పూర్వం నుంచి వాటితో మానవాళికి ఉన్న సంబంధాలను తెలియజేసి, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో దీన్ని ప్రతిపాదించింది.
2008లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 8ని ‘ప్రపంచ మహాసముద్ర దినోత్సవం’గా అధికారికంగా ప్రకటించింది.
2025 నినాదం: "Wonder: Sustaining what sustains us"