భారత జనాభా 146 కోట్లు దాటినట్లు ఐక్యరాజ్యసమితి తన ‘ప్రపంచ జనాభా స్థితి నివేదిక’తో తెలిపింది. అయితే జనాభాను ఇదే స్థాయిలో కొనసాగించడానికి అవసరమైన జననాల పెరుగుదల (రిప్లేస్మెంట్) కంటే దేశంలో జననాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. జనాభా పొందికలో, సంతాన సాఫల్యంలో, ప్రజల ఆయుర్దాయంలో వస్తున్న మార్పుల్ని ఇందులో విశ్లేషించింది. దేశంలో జననాల రేటు సరాసరిన ప్రతి మహిళకు 1.9కి పడిపోయిందని, జనాభా పెరుగుదలను ఇప్పటి స్థాయిలోనే కొనసాగించేందుకు అవసరమైన పెరుగుదల పడిపోయిందని నివేదిక పేర్కొంది. అంటే ఒక తరంలో ఉన్న జనాభా సంఖ్య తదుపరి తరానికి తగ్గిపోతుందన్న మాట.