విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల్ని సమావేశపరిచే సమయంలో కనీసం పది నిమిషాల సమయాన్ని వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టంచేసింది.