- భారత సాయుధ దళాల్లో నావికా విభాగం ఒకటి. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో, మన తీర ప్రాంతాలను కాపాడటంలో, శత్రుమూకల కారణంగా సముద్రంలో తలెత్తే సంక్షోభాలను ఎదుర్కోవడంలో భారత నావికా దళం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సాధించిన విజయాలు, దేశ రక్షణలో అంకితభావంతో అందించే సేవలను గౌరవించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 4న ‘నావికాదళ దినోత్సవం’గా (Navy Day) నిర్వహిస్తారు. జాతీయ భద్రతను కాపాడటం, అంతర్జాతీయ సంబంధాలు - సహకారాన్ని పెంపొందించడం, స్థిరమైన సముద్ర వాతావరణాన్ని ప్రోత్సహించడంలో నావికాదళ పాత్రను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- చారిత్రక నేపథ్యం
- 1971 డిసెంబరు 3న భారత్ - పాకిస్థాన్ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్థాన్ చెర నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఇది జరిగింది. భారత వైమానిక స్థావరాలపై పాకిస్థాన్ ఊహించని దాడి చేసింది. దీనికి ప్రతిగా మన నావికాదళం డిసెంబరు 4న ఆపరేషన్ ట్రైడెంట్ (Trident)ను ప్రారంభించింది. కరాచీలోని నావికా ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపింది.
- ఆపరేషన్ ట్రైడెంట్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న మన దేశంలో నావికాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1972 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.