జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన పాశవిక అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో ఏర్పాటైన ‘నిహాన్ హిడాంక్యో’ అనే సంఘానికి నోబెల్ శాంతి బహుమతి 2024 వరించింది. ఈ బాధితులు అకుంఠిత దీక్షతో శాంతి, అణ్వస్త్రరహిత ప్రపంచం కోసం గళమెత్తారని అవార్డు కమిటీ పేర్కొంది.
1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణు బాంబు ప్రయోగించింది. ఫలితంగా 1.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 9న నాగసాకిపై మరో బాంబును అమెరికా వేసింది. ఇందులో 70 వేల మంది బలయ్యారు. నాటి విధ్వంసంలో ప్రాణాలు దక్కించుకున్నవారిని ‘హిబాకుషా’గా అభివర్ణిస్తుంటారు. వీరు, పసిఫిక్ అణ్వస్త్ర పరీక్షల బాధితులు కలిసి 1956లో నిహాన్ హిడాంక్యోను ఏర్పాటు చేశారు.