దేశ 16వ జన గణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటే కుల గణననూ చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది.
ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది.
అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జన గణన పూర్తి కానుంది.
అంతకుముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ను ప్రారంభిస్తారు.
మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్ధాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబరు ఆఖరు నాటికే జన గణన పూర్తి కానుంది.
ఈ ప్రాంతాలకు 2026 అక్టోబరు 1ని రెఫరెన్స్ తేదీగా ప్రకటించింది.
జనాభా లెక్కల చట్టం-1948లోని (సెన్సస్ యాక్ట్-1948) సెక్షన్ 3 నిబంధనల ప్రకారం.. ఈ వివరాలను జూన్ 16న అధికారిక గెజిట్లో ప్రచురించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
వాస్తవానికి 2021లోనే జన గణన జరగాల్సి ఉంది. కొవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది.
16 ఏళ్ల తర్వాత జన గణన జరగనుంది.
ఇదివరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ కులాల వివరాల సేకరణకే ప్రభుత్వం పరిమితమైంది.
ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలనూ ప్రత్యేకంగా సేకరించనుంది.