దేశంలో 2023-24లో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరినట్లు కేంద్ర పశు సంవర్థకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో మన దేశమే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. 2022-23లో ఇది 23.58 కోట్ల టన్నులే. 2014-15లో పాల ఉత్పత్తి 14.63 కోట్ల టన్నులుగా ఉంది.
క్షీర విప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ జయంతి అయిన నవంబరు 26ను ఏటా జాతీయ క్షీర దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో 2022-23లో తలసరి పాల లభ్యత 459 గ్రాములు కాగా ఇప్పుడది 471 గ్రాములకు పెరిగిందని రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. గడచిన పదేళ్లలో ప్రపంచమంతటా పాల ఉత్పత్తి సగటున 2 శాతం పెరగ్గా భారత్లో 6 శాతం పెరిగిందని వెల్లడించారు.
భారత్లో 2023-24లో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసిన మొదటి ఆయిదు రాష్ట్రాలు: ఉత్తర్ ప్రదేశ్ (16.21శాతం), రాజస్థాన్ (14.51%), మధ్యప్రదేశ్ (8.91%), గుజరాత్ (7.65%), మహారాష్ట్ర (6.71%).