అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా.. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2014, జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.
పూర్వ కాలం నుంచే ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది.
హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణ క్రీ.పూ.6వ శతాబ్దంలో విలసిల్లిన షోడశ మహాజనపదాల్లో ఒకటిగా ఉండేది.
పురాణాల్లో పేర్కొన్న దక్షిణాపథం, తైలింగులు, త్రిలింగదేశం మొదలైనవన్నీ తెలంగాణను సూచిస్తున్నాయి.
తెలంగాణ ఆవిర్భావం:
పెద్ద మనుషుల ఒప్పందం సరిగ్గా అమలు కాకపోవడంతో 1969లో ఖమ్మంలో జై తెలంగాణ ఉద్యమం మొదలైంది.
అదే ఏడాది కేంద్రం స్పందించి 8 సూత్రాల ప్రణాళిక ప్రవేశపెట్టగా అది తిరస్కరణకు గురైంది.
1972లో జై ఆంధ్ర ఉద్యమం జరగడంతో కేంద్రం స్పందించి మళ్లీ 6 సూత్రాల ప్రణాళిక ప్రవేశపెట్టింది.
కొంతకాలానికి ఇది సరగ్గా అమలు కాకపోవడంతో ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.
2010లో తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని నియమించింది.
దీని సిఫార్సు ప్రకారం 2013లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
2014, మార్చి 1న నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేయడంతో జూన్ 2న 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలున్నాయి.