దేశంలోని ప్రజలకు రక్షణ (Security), భద్రత (Safety) కల్పించే సామర్థ్యాన్ని జాతీయ భద్రత అంటారు. అంతర్గత స్థిరత్వం, భౌగోళిక ప్రయోజనాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. జాతీయ భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ రక్షణే ధ్యేయంగా నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ (ఎన్ఎస్సీ) ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. దీని ఆవిర్భావానికి గుర్తుగా ఏటా మార్చి 4న ‘జాతీయ భద్రతా దినోత్సవం’గా (National Safety Day) నిర్వహిస్తారు. పర్యావరణం, కార్యాలయ భద్రత, ఆరోగ్య నియమాలు, మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
సమాజంలోని అన్ని రంగాల్లో భద్రతపై అవగాహన కల్పించే ధ్యేయంతో భారత ప్రభుత్వం 1966, మార్చి 4న నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ (ఎన్ఎస్సీ) ఆఫ్ ఇండియాను నెలకొల్పింది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా ఆ తేదీన ‘జాతీయ భద్రతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించింది. భద్రతపై విస్తృత ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి 4 నుంచి 11 వరకు జాతీయ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తారు.