వ్యాధిని కట్టడి చేసి, రోగికి ఉపశమనం కలిగించడంలో ఔషధాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని తయారు చేసేవారే ఫార్మసిస్టులు. సురక్షితమైన, ప్రభావవంతమైన ఔషధ చికిత్సను నిర్ధారించడంలో వారి విద్యా నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఫార్మసీ విద్యకు పితామహుడిగా పేర్కొనే ప్రొఫెసర్ మహదేవ లాల్ ష్రాఫ్ (ఎం.ఎల్. ష్రాఫ్) జయంతి సందర్భంగా ఏటా మార్చి 6న ‘జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం’గా (National Pharmacy Education Day) నిర్వహిస్తారు. ప్రజారోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్రను గుర్తించడంతోపాటు వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
భారతదేశ ఫార్మా రంగంలో అనేక సంస్కరణలకు ప్రొఫెసర్ మహదేవ లాల్ ష్రాఫ్ ఆద్యుడు. దేశంలో ఫార్మాస్యూటికల్ విద్య, దాని శాస్త్రీయ - సాంకేతిక అంశాల పురోగతిపై అవగాహన పెంచడంలో గణనీయంగా కృషిచేశారు. ఈయనకు ‘భారతీయ ఔషధ విద్య మార్గదర్శకుడు - పితామహుడు’ అనే బిరుదులు లభించాయి. ఈయన కృషికి గుర్తుగా ఏటా ఆయన జయంతిని ‘జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం’గా జరుపుకోవాలని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తీర్మానించింది. 2023 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.