గురుగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న యూరోపా అనే చందమామపై జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా 2024, అక్టోబరు 14న ఒక వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. యూరోపా క్లిపర్ అనే వ్యోమనౌక 300 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి గురు గ్రహాన్ని చేరుతుంది. ఇందుకు ఐదున్నరేళ్లు పడుతుంది.
గురుగ్రహ కక్ష్యలోకి చేరాక యూరోపా క్లిపర్ 49 సార్లు యూరోపాకు చేరువగా వచ్చి వెళుతుంది. హిమమయంగా ఉండే ఈ చందమామ ఉపరితలం కింద భారీ సముద్రం ఉండొచ్చని, అక్కడి నీటిలో జీవుల మనుగడకు అవసరమైన వాతావరణం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. యూరోపా క్లిపర్ బరువు 5,700 కిలోలు. ఈ ప్రాజెక్టు వ్యయం 520 కోట్ల డాలర్లు.