Published on Apr 7, 2025
Current Affairs
కేంద్ర గణాంకాల శాఖ నివేదిక
కేంద్ర గణాంకాల శాఖ నివేదిక

కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2024’ నివేదిక ప్రకారం, జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధిరేటు కొన్నేళ్లుగా తగ్గుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. 1971లో గరిష్ఠంగా 2.2%గా నమోదైన జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధిరేటు, 2036 నాటికల్లా 0.58%కు పడిపోనుందని పేర్కొంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధుల (60 ఏళ్లు పైబడినవారు) జనాభా బాగా పెరగనుంది. ఫలితంగా- ‘ఆధారపడేవారి నిష్పత్తి’ మారనుంది. ఇప్పటివరకూ పెద్దలపై యువకులు ఆధారపడుతుండగా, ఇకమీదట పిన్నలపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతాయి. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్‌ కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు/యువత జనాభా ఎక్కువుండేది. కానీ 2026, 2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్‌ అడుగు భాగం కుంచించుకుపోనుంది. వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌ జనాభా పెరగనుంది.