స్వయంకృషితో ఎదిగిన 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ - హురున్ ఇండియా ‘టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలేనియా 2025’ జాబితాను రూపొందించింది. ఇందులో విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ తొలిసారిగా అడుగుపెట్టి, ఏకంగా టాప్-10లో నిలిచారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ సంస్థ మార్కెట్ విలువ 2025లో రూ. 2.2 లక్షల కోట్లకు చేరడంతో, ఈ జాబితాలో వీరు మూడో స్థానం దక్కించుకున్నారు.
ముఖ్యాంశాలు..
జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ వంటి సంస్థలను నిర్వహిస్తున్న ఎటర్నల్ మార్కెట్ విలువ రూ.3.2 లక్షల కోట్లకు చేరడంతో.. ఈ జాబితా అగ్రస్థానంలో సంస్థ అధిపతి దీపిందర్ గోయల్ నిలిచారు. 2024లో తొలిస్థానంలో ఉన్న డిమార్ట్ మార్కెట్ విలువ 13% తగ్గడంతో, ఆ సంస్థ అధినేత దమానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు.
మొత్తం 200 కంపెనీల మార్కెట్ విలువ రూ.42 లక్షల కోట్లుగా నిలిచింది. బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,000 కోట్ల) విలువైన కంపెనీల సంఖ్య 121 నుంచి 128కి చేరింది. 22 కొత్త కంపెనీలు ఈ జాబితాలోకి ఎక్కాయి.