ఏపీలో మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 ఉచిత శిక్షణకు గాను సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ శాఖలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వ కల్పించనుంది.
వివరాలు:
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ 2024-25
సీట్లు: మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050; ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయించారు. ఎంపికైన వారికి ఉచితంగా బోధన, భోజనం, వసతి సౌకర్యాలు అందుతాయి.
అర్హత: ఎస్జీటీ కోచింగ్కు ఇంటర్, డీఈడీ, టెట్; స్కూల్ అసిస్టెంట్ కోచింగ్కు డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, టెట్ స్కోరుకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
ప్రభుత్వం చేసే ఖర్చు:
ఎస్జీటీ అభ్యర్థులకు శిక్షణ కోసం ఫీజు రూ.10 వేలు, స్టడీ మెటీరియల్కు రూ.3 వేలు, డైట్ బిల్లు నెలకు రూ.4,500 చొప్పున మూడు నెలలకు రూ.13,500 కలిపి మొత్తం ఒక అభ్యర్థిపై రూ.26,500 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు శిక్షణ కోసం ఫీజు రూ.12 వేలు, స్టడీ మెటీరియల్కు రూ.3 వేలు, డైట్ బిల్లు మూడు నెలలకు రూ.13,500 కలిపి మొత్తం రూ.28,500 ప్రభుత్వం వ్యయం చేయనుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2024.