అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది. రిసెర్చ్ ఆక్టేన్ నంబరు (ఆర్ఓఎన్) 95తో ఈ పెట్రోలు ఉండాలనీ చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇథనాల్ను చెరకు, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. వాహన ఇంజిన్లలో కేవలం పెట్రోలును వాడడంతో పోలిస్తే, ఇథనాల్ కలిపి వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం తక్కువగా ఉంటుంది. చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి రైతులకు మద్దతు ధర లభిస్తుంది. దేశంలోకి ముడి చమురు దిగుమతులూ తగ్గించొచ్చు.