2030-31 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశలో భారత్ అడుగులు వేస్తోందని అంతర్జాతీయ ఆర్థిక సమాచారం-విశ్లేషణా సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) భారత వృద్ధిరేటు 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
* వర్థమాన మార్కెట్ల సూచీల్లో భారత్ చేరికతో, భారత ప్రభుత్వ బాండ్లలోకి విదేశీ పెట్టుబడుల రాక పెరిగింది. ఇది కొనసాగొచ్చు.
* వాణిజ్య లాభాలను పెంచుకునేందుకు మౌలిక వసతులను, భౌగోళిక రాజకీయ వ్యూహాలను అభివృద్ధి చేసుకోవాలి. దేశానికి ఉన్న విస్తృత తీర ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారించాలి.
* దేశీయంగా ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో పునరుత్పాదక, తక్కువ ఉద్గార ఇంధనాలు, ఇంధన భద్రత సమతుల్యత లాంటి వాటిపై దృష్టి సారించాలి.