చిరుధాన్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) అధ్యయనం వెల్లడించింది.
తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో వాటి సాగు భారీగా పెరుగుతోందని, వినియోగం విస్తరిస్తోందని పేర్కొంది.
తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సంస్థ అధ్యయనం నిర్వహించి ‘‘చిరుధాన్యాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. దక్షిణ భారత అధ్యయనం నుంచి పాఠాలు’ పేరిట తాజాగా నివేదికను విడుదల చేసింది.
2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని కె.హిల్స్ బ్లాక్ కేంద్రంలో అధ్యయనాంశాలను వెల్లడించింది.
నివేదికలోని అంశాలు:
దేశంలో మొత్తం ఆహారధాన్యాలు 200 మిలియన్ టన్నులు కాగా.. అందులో చిరుధాన్యాల ఉత్పత్తి 20 మిలియన్ టన్నుల కంటే తక్కువగా ఉంది. దేశంలో చిరుధాన్యాలకు ప్రస్తుత నికర రాబడి హెక్టారుకు దాదాపు రూ.10,000 మాత్రమే. 2011-15 సంవత్సరాలలో వరికి వెచ్చించిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం 224 శాతం, గోధుమలకు 304 శాతం కాగా చిరుధాన్యాలకు 100 శాతమే ఉంది.