రాజస్థాన్లోని అజ్మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవ్మాలీ భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని పరిరక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్న పాత్ర ఆధారంగా ఈ అవార్డులకు ఎంపిక జరిగింది.
దేవ్మాలీ ప్రత్యేకత ఏమిటంటే.. గ్రామానికి చెందిన 3,000 బీఘాల (1,875 ఎకరాల) భూమిని స్థానికంగా కొండపై వెలసిన దేవనారాయణ్ స్వామికి అంకితం చేశారు. ఏళ్లతరబడి గ్రామంలో నివసిస్తున్నా స్థానికులు ఎవరి వద్దా భూయాజమాన్య పత్రాలు ఉండవు. గ్రామస్థులకు శాశ్వత నివాసాలూ లేవు. ఎటుచూసినా గడ్డి కప్పిన మట్టి ఇళ్లే కనిపిస్తాయి. గ్రామంలో మాంసాహారం, మద్యపానం నిషేధం. వంటకు కిరోసిన్, వేప కలప వాడరు. ఇళ్లకు తాళాలు లేకున్నా, దశాబ్దాలుగా దొంగతనాలంటే ఏమిటో ఈ గ్రామస్థులు ఎరుగరు.