ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యల్లో వ్యర్థాల నిర్వహణ ఒకటి. పరిసరాలు, పర్యావరణంతో సహా జీవుల ఆరోగ్యానికి వ్యర్థాలు ఇబ్బందిగా మారాయి. ప్రపంచ దేశాలు ఎంతగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే అంతగా ఇవి పేరుకుపోతున్నాయి. వీటిని సరిగ్గా నిర్వహించకపోతే శుభ్రత లోపించి నేల, నీరు, గాలి కలుషితం అవుతాయి. తద్వారా మానవ మనుగడకు అవరోధం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేసి, సుస్థిర వినియోగ - ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా మార్చి 30న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా నిర్వహిస్తారు. ఈ రోజు ఆహార వృథాను అరికట్టడంపై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. వ్యర్థాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
యూఎన్ఓ జనరల్ అసెంబ్లీ 2022, డిసెంబరు 14న తన 77వ సమావేశంలో మార్చి 30న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా నిర్వహించాలని తీర్మానించింది. దీని ద్వారా అజెండా 2030లోని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 11వది (నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారుచేయడం), 12వది (సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన) సాధించవచ్చని అభిప్రాయపడింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ), యూఎన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రాం (యూఎన్-హెబిటాట్) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తాయి.
2026 నినాదం: Zero waste starts on your plate