ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్టీఈఎం) విభాగాల్లోని అన్ని స్థాయుల్లో నేటికీ గణనీయమైన లింగ అంతరం కొనసాగుతోంది. స్త్రీలు విద్యలో రాణించడంతోపాటు ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నాయకత్వ స్థాయికి ఎదగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. శాస్త్రీయ రంగాల్లో బాలికలు, మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా నిర్వహిస్తారు. ఎస్టీఈఎం రంగాల్లో విజయవంతమైన స్త్రీలను గౌరవించుకోవడంతోపాటు వారి సహకారాన్ని గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
2013, డిసెంబరు 20న యూఎన్ జనరల్ అసెంబ్లీ ‘అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణ’ అనే తీర్మానాన్ని ఆమోదించింది. అందులో లింగ సమానత్వం, మహిళలు - బాలికల సాధికారతకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణల్లో సమాన అవకాశాలు, భాగస్వామ్యం తప్పనిసరని పేర్కొంది. ఈ భావనను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా జరుపుకోవాలని 2015లో ప్రకటించింది.
2026 నినాదం: “Synergizing AI, Social Science, STEM and Finance: Building Inclusive Futures for Women and Girls.”