భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన ‘స్టేట్ ఫైనాన్సెస్’ నివేదిక ప్రకారం, దేశంలో యువ జనాభా తగ్గిపోతూ వయోధికులు అధికమవుతున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గణాంకాల ప్రకారం.. 60 ఏళ్ల పైబడిన జనాభా 15% మించితే ఆ రాష్ట్రాలకు వయోభారం పెరిగినట్లు లెక్క. అదే 10-15% మధ్యలో ఉంటే నడి వయసులో ఉన్నట్లు, 10%లోపు ఉంటే యుక్తవయసులో ఉన్నట్లు అంచనా.
దీని ప్రకారం చూస్తే 2016 నాటికి దేశంలో ఏ రాష్ట్రమూ వయోభారం జాబితాలో లేదు. అయితే, 2026 నాటికి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 60 ఏళ్ల పైబడిన జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్-5, తెలంగాణ-10వ స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం జన సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్-10, తెలంగాణ-13వ స్థానంలో ఉన్నాయి. 2036 నాటికి అత్యధిక వయోధికుల శాతం విషయంలో ఆంధ్రప్రదేశ్-4, తెలంగాణ-7వ స్థానానికి చేరుకుంటాయి.