పర్యావరణ కాలుష్యం వల్ల మానవాళితోపాటు అనేక ఇతర జంతువులు ప్రభావితమవుతున్నాయి. అలా నష్టపోతోన్న జాతుల్లో ధ్రువపు ఎలుగుబంటి ఒకటి. ఇటీవలి కాలంలో వీటి జనాభా వేగంగా క్షీణిస్తోంది. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం, వాతావరణ మార్పుల వల్ల వేగంగా తరిగిపోతోన్న ధ్రువపు ఎలుగుబంట్లను రక్షించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 27న ‘అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం’గా (International Polar Bear Day) నిర్వహిస్తారు. వీటి సంరక్షణకు, అవి ఉండే ఆవాసాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా ధృవపు ఎలుగుబంట్ల సంతతిని రక్షించే లక్ష్యంతో 1992, జనవరిలో ‘పోలార్ బియర్స్ ఇటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. మొదట ఇది కెనడా, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించచగా తర్వాత రష్యా, గ్రీన్లాండ్, నార్వేలకు విస్తరించింది. భూమిపై ధృవపు ఎలుగుబంట్ల జాతి కొనసాగాంటే గ్లోబర్ వార్మింగ్ను అరికట్టాలని ఈ సంస్థ నినదించింది. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేదుకు ఒక రోజును ఏర్పాటు చేయాలని భావించింది. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి 27న ‘అంతర్జాతీయ ధృవపు ఎలుగుబంటి దినోత్సవం’గా నెలకొల్పింది. 2011 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.