దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులు అంటారు. ఇవి సహజ వనరులు. మానవ ప్రమేయం లేకుండానే ప్రకృతిలో వాటంతట అవే పుట్టి, పెరుగుతాయి. జీవావరణ వ్యవస్థలో, ప్రకృతి సమతౌల్యతలో కీలకమైనవిగా, అత్యంత విలువైనవిగా అడవులను పేర్కొంటారు. ఇవి అనేక వృక్షాలు, జంతు జాతులకు ఆవాసాలుగా ఉంటాయి. జనాభా పెరుగుదల, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి లాంటి కార్యకలాపాల వల్ల వీటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో వన్యప్రాణులతోపాటు సమస్త భూమండలానికి ముప్పు వాటిల్లుతోంది. వీటిని అధిగమించి అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం (World Forestry Day/ International Day of Forests)గా నిర్వహిస్తారు. అడవుల నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) మార్చి 21న ‘వరల్డ్ ఫారెస్ట్ డే’గా నిర్వహించాలని భావించింది. 1971లో జరిగిన ఎఫ్ఏఓ 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలూ దీన్ని ఆమోదించాయి. తర్వాత 2012, నవంబరు 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది.
2026 నినాదం: "Forests and Economies".