తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో 2026, మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టారు. నూతనంగా తొమ్మిది సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత బడ్జెట్లో (2025-26) అన్ని రకాల సంక్షేమ పథకాలకు కలిపి రూ.1.04 లక్షల కోట్లు కేటాయిస్తే వచ్చే ఏడాదికి ఈ పద్దు కింద రూ.1,45,591 కోట్లను ప్రతిపాదించింది. మొత్తం బడ్జెట్ వ్యయంలో సంక్షేమ పథకాలకు కేటాయింపులు 44.90% కాగా.. గత బడ్జెట్లో ఇది 34.21 %. మొత్తం 69 రకాల సంక్షేమ పథకాలను వివిధ శాఖల్లో అమలుచేస్తున్నారు.
మూలధన వ్యయ పద్దును ప్రభుత్వం రూ.36,504 కోట్ల నుంచి రూ.47,267 కోట్లకు భారీగా పెంచింది. ఏకంగా 29.40 శాతం పెంపును బడ్జెట్లో ప్రతిపాదించడం రాష్ట్ర అభివృద్ధికి ఉపకరిస్తుందని అంచనా. మొత్తం 28 ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు వీటిని ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. గ్యారంటీ హామీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు వచ్చే ఏడాదికి రూ.50,713 కోట్ల కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) కోసం గత బడ్జెట్లో వేసిన రూ.3.04 లక్షల కోట్ల అంచనాలకంటే ఆదాయం రూ.23,626 కోట్లు తగ్గింది. దీనిప్రకారం సవరించిన అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్ ఆదాయం రూ.2.81 లక్షల కోట్లకు తగ్గిపోయింది. అయినా ప్రభుత్వం మరిన్ని భారీ ఆదాయ లక్ష్యాలతో.. సుమారు రూ.43 వేల కోట్లు పెంచి రూ.3.24 లక్షల కోట్ల కొత్త బడ్జెట్ను రూపొందించింది.
గత బడ్జెట్ అంచనాలకంటే అదనంగా పెంచిన రూ.43 వేల కోట్ల బడ్జెట్ ఆదాయ అంచనాలలో ఏ పద్దు కింద ఎంత పెరుగుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పన్నులద్వారా రూ.14 వేల కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలో రూ.13 వేల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.6,412 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.3,710 కోట్లు, కొత్త రుణాలు రూ.5,325 కోట్లు అదనంగా వస్తాయని ప్రభుత్వం వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలతో ఆర్థిక అస్థిరత నెలకొన్నా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్డీపీ) వృద్ధిరేటు గతేడాది 10.6 శాతముంటే ఈ ఏడాది 10.7 శాతానికి పెరగడం ఆశాజనకంగా భావిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ సగటు వృద్ధిరేటు 9.8 నుంచి 8 శాతానికి పడిపోయినా రాష్ట్రానికి 10.7 శాతానికి పెరిగింది. జీఎస్డీపీ విలువ రూ.17.82 లక్షల కోట్లకు చేరింది. కొత్త రుణాల సేకరణకు జీఎస్డీపీ విలువ పెరుగుదల అత్యంత కీలకం. దీని ఆధారంగానే ఎఫ్ఆర్బీఎం పరిమితిలో తీసుకునే కొత్త రుణాలు ఈ ఏడాది సేకరించిన రూ.77,545.92 కోట్లకన్నా వచ్చే ఏడాది మరో రూ.5,325 కోట్లు అదనంగా వస్తాయని ప్రభుత్వం వివరించింది.
శాసనమండలిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రవేశపెట్టారు.
వివిధ శాఖలకు కేటాయింపులు (రూ.కోట్లలో)
ఆర్థికశాఖ
60,438
ఇంధన
21,285
వెనుకబడిన తరగతుల సంక్షేమం
12,511
హోం
11,907
ఎస్సీ కులాల అభివృద్ధి
11,784
రోడ్లు-భవనాలు
8,298
ప్రణాళిక
7,981
గిరిజన సంక్షేమం
7,937
గృహనిర్మాణం
7,430
పౌరసరఫరాలు
7,366
రవాణా
4,491
రెవెన్యూ
4,020
మైనార్టీ సంక్షేమం
3,769
పరిశ్రమలు-వాణిజ్యం
3,747
మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం
3,143
న్యాయ
2,306
యువజన, పర్యాటక, సాంస్కృతిక
2,127
పశు సంవర్ధక-మత్స్య
1,529
సాధారణ పరిపాలన
1,190
పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక
1,049
కార్మిక-ఉపాధికల్పన
998
ఐటీ
875
శాసనసభ వ్యవహారాలు
259
పశుసంవర్ధక శాఖ
1,529