రాష్ట్రంలో జనన, మరణాల నమోదు ప్రక్రియ నిర్వహించే ‘పౌర నమోదు వ్యవస్థ’ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం-సీఆర్ఎస్)కు సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని కేంద్ర జనాభా లెక్కల విభాగం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా సీఆర్ఎస్ పనితీరుపై ఓ నివేదికలో తెలిపింది. 2024లో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీ కార్యాలయాల్లో సీఆర్ఎస్ వ్యవస్థలోని 12,910 కార్యాలయాల్లో అధికారులు కేవలం 48 సార్లు మాత్రమే తనిఖీలు చేశారు. జనన నమోదు చట్టం ప్రకారం.. జననం లేదా మరణం తర్వాత 21 రోజుల గడువులోగా సమీపంలోని మున్సిపల్ లేదా పంచాయతీ కార్యాలయంలో నమోదు (రిజిస్టర్) చేయించే విషయంలో తెలంగాణ వెనుకబడింది. గడువులోగా 2024లో కేవలం 73.5 శాతంతో 20వ ర్యాంకు, మరణాల నమోదులో 80.2 శాతంతో 18వ ర్యాంకులో తెలంగాణ నిలిచిందని వివరించింది.