మనదేశ బయోఎకానమీ 2035 కల్లా 691 బి. డాలర్ల(దాదాపు రూ.66 లక్షల కోట్ల)కు, 2047 కల్లా 2.6 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.250 లక్షల కోట్ల)కు చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఫలితంగా 3 కోట్లకు పైగా ఉన్నత స్థాయి ఉద్యోగాల సృష్టీ జరుగుతుందని తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి 3 బయోటెక్నాలజీ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందనీ అంచనా వేసింది.
ఆహారం, ఇంధనం, పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పునరుత్పాదక బయోలాజికల్ వస్తువులతో ఏర్పడే ఆర్థిక నమూనాను బయోఎకానమీగా పరిగణిస్తారు. 2047 కల్లా ఆ స్థాయికి బయోఎకానమీని చేర్చాలంటే దేశవ్యాప్తంగా సమన్వయ కార్యాచరణ ప్రణాళిక వైపుగా నడవాలని సూచించింది.