గత విద్యాసంవత్సరం (2025-26)లో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల్లో సర్కారు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివినవారు సగం కంటే తక్కువ ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. ప్రధాన రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే 7 రాష్ట్రాల్లోనే ఇది 50 శాతం దాటింది. దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ‘ప్రైవేట్’లో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తేలింది.
2025-26లో దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 24.72 కోట్లు కాగా.. వారిలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివినవారు 11.89 కోట్ల మంది. అంటే 48.09 శాతం మాత్రమే. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన 2.46 కోట్ల మందిని కూడా కలుపుకొంటే అది 58.05 శాతానికి చేరుతుంది.